Oct 02,2022 23:43

బాబు రెడ్డి, మీగడ వెంకటేశ్వర రెడ్డి..

ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి :
తూర్పు రాయలసీమ పట్టభద్రులు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు పోటీ చేసే పిడిఎఫ్‌ అభ్యర్థులు ఎంపిక ఉద్యమ నాయకుల్ని చేశారు. ఆది నుంచి వివిధ ఉపాధ్యాయ కార్మిక కర్షక సంఘాల్లోని సమస్యలపై అలుపెరుగని పోరాటం నిర్వహించారు దాని ఫలితంగా ఈ ఉద్యమ అభ్యర్థులను పిడిఎఫ్‌ అభ్యర్థులుగా ఎన్నుకున్నారు.
బాబు రెడ్డి
తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయనున్న పొక్కిరెడ్డి బాబురెడ్డి 1964 గూడూరు నెల్లూరు జిల్లాలో జన్మించారు. ఇక్కడే సరస్వతినగర్‌లో నివాసం ఉంటున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఎంజీఎం ఎలిమెంటరీ స్కూల్లో, 6 నుంచి 10 వరకు జడ్పీ హైస్కూలు గూడూరులో, ఇంటర్‌ ఎస్‌కేఆర్‌ ప్రభుత్వ కాలేజీ, బిఏ డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్‌లో పూర్తి చేశారు. టీచర్‌ ట్రైనింగ్‌ పల్లిపాడు నెల్లూరు జిల్లాలో, బీఈడీ ఎస్వీ యూనివర్సిటీ తిరుపతిలో పూర్తి చేశారు. 86లో స్పెషల్‌టీచర్‌ చిల్లకూరు మండలంలో పనిచేశారు. అనంతరం 89లో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ ముత్తుకూరులో, 2018 స్కూల్‌ అసిస్టెంట్‌గా సోషల్‌ బోధించారు. ప్రస్తుతం ఎంపియుపిఎస్‌ నిధి ముసలి ఇందుకూరుపేటలో పనిచేస్తున్నారు, విద్యార్థి దశలో ఎస్‌ఎఫ్‌ఐలో పనిచేశారు.. ఎస్‌కే ఆర్‌ ప్రభుత్వ కాలేజీ గూడూరులో విద్యార్థి సంఘానికి ఇంటర్‌ విభాగం నుంచి కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
జనవిజ్ఞాన వేదికలో నెల్లూరు జిల్లాలో ప్రారంభదశలో చురుకుగా పనిచేశారు. జనవిజ్ఞాన వేదిక మొదటి రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. అక్షరాస్యత ఉద్యమంలో ఉపాధ్యాయులను కదిలించడంలో కీలకపాత్ర పోషించారు. అలాగే 1990 నుండి రాష్ట్ర కౌన్సిలర్‌గా, 91లో జిల్లా కార్యదర్శిగా 92లో జిల్లా ప్రధాన కార్యదర్శిగా 2010 వరకు జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఉపాధ్యాయ సంచిక ప్రధాన సంపాదకులుగా ఉంటున్నారు. ఎస్టిఎఫ్‌ఐలో అఖిలభారత కార్యదర్శిగా పనిచేశారు. ఎన్‌ఈపి, సిపిఎస్‌ రద్దు కోసం అఖిల భారత స్థాయిలో ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఫ్యాప్టో చైర్మన్‌గా ఉపాధ్యాయ ఉమ్మడి ఉద్యమానికి నాయకత్వం వహించారు. 2017 -18లో పాఠశాలల మూత, వెబ్‌ కౌన్సిలింగ్‌ రద్దు, సిపిఎస్‌ రద్దు కోసం జరిగిన జాత నిర్వహణలో అన్ని సంఘాలను సమన్వయం చేసుకొని పనిచేశారు. ఆ రెండేళ్లలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కషి చేశారు. యుటిఎఫ్‌ పక్షాన జేఏసీలో కోచైర్మన్‌ బాధ్యతల్లో ఉంటూ జేఏసీ పోరాటాలు రూపొందించడంలో చురుకుగా వ్యవహరించారు.
మీగడ వెంకటేశ్వర రెడ్డి..
పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీచేయనున్న మీగడ వెంకటేశ్వరరెడ్డి 1958లో ప్రకాశం జిల్లా కనిగిరి మండలం గుండ్లపాలెంలో జన్మించారు. ఒకటి నుండి మూడో తరగతి వరకు తాళ్లూరు ప్రాథమిక పాఠశాలాలో, నాలుగు, ఐదు తరగతులు కనిగిరి ఎంబీఏం ప్రాథమిక పాఠశాలలో, 6 7 8 తరగతులు కనిగిరి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో, తర్వాత మెట్రిక్యులేషన్‌ ఇంటర్‌ కనిగిరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదువుకున్నారు. డిగ్రీ బిఎస్సి బయాలజీ ఫిజిక్స్‌ కెమిస్ట్రీ చీరాలలో పూర్తి చేశారు. గుంటూరులోని ఏఎల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లో బిఈడిని పూర్తిచేశారు.
84లో లింగసముద్రం మండలంలో ఎర్రారెడ్డిపాలెం సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా, తరువాత తాళ్లూరు ఎల్‌ఎఫ్‌ఎల్‌హెచ్‌ఎంగా తదుపరి కన్వర్షన్‌పై ఫిజిక్స్‌ సైన్స్‌ అసిస్టెంట్‌గా పనిచేశారు. మార్కాపురం సంతనూతలపాడు హైస్కూలు కంచర్లవారిపల్లి చింతలపాలెం హైస్కూల్లో ఫిజిక్స్‌ సైన్స్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించారు. ఈయన పాఠశాల అభివద్ధి కోసం తాళ్లూరు యూపీ స్కూల్లో పనిచేస్తూ గ్రామస్తుల సహకారం స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి సహకారంతో దానిని హైస్కూల్‌గా అప్‌ గ్రేట్‌ చేయించారు. అనంతరం మార్కాపురం యూపీ స్కూల్లో పనిచేస్తూ గ్రామస్తుల సహకారంతో ఐదు ఎకరాల స్థలం ఉచితంగా సేకరించి సొంత నిధులతో హైస్కూల్‌ గా అప్గ్రేడ్‌ చేయించారు.
అనంతరం కంచర్లవారి ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ ఆ స్కూలు రోల్‌ 450 నుంచి 670వరకు పెంచారు. తోటి ఉపాధ్యాయులు సహకారంతో 10వ తరగతి విద్యార్థులు సగటున ప్రతి సంవత్సరం 150 మందిని ఫిబ్రవరి నుండి పరీక్షలు అయిపోయే వరకు స్కూల్లోనే ఉంచి చదివించడం పరీక్షలలో మంచి ఫలితాలు సాధించారు. ఈయన ఉపాధ్యాయ పోరాటంలో అనేక బాధ్యతలు నిర్వహించారు. 1986లో మొదటగా మండలాలు ఏర్పడినప్పుడు మొదటి లింగసముద్రం మండల ప్రధాన కార్యదర్శిగా, 1992లో జిల్లా కార్యదర్శిగా 2000లో జిల్లా అధ్యక్షులుగా, తరువాత రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం ఐక్య ఉపాధ్యాయ పత్రిక సంపాదక వర్గ సభ్యులుగా చేశారు.
పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు
2023 ఫిబ్రవరి, మార్చి నెలలో జరుగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌ అభ్యర్థులను ప్రకటించారు. ఈమేరకు విజయవాడలో ఆదివారం నిర్వహించిన యుటిఎఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లూరు ప్రాంతానికి చెందిన పి.బాబురెడ్డిని, గ్రాడ్యుయేట్‌ అభ్యర్థిగా మీగడ వెంకటేశ్వరరెడ్డిని ఎంపిక చేశారు. వీరిని గెలిపించాలని యుటిఎఫ్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సుధాకర్‌ రెడ్డి, జివి రమణ కోరారు.