Apr 25,2021 17:16

పుస్తక పరిచయం..

   ఈ పుస్తకంలో నెల్లూరు గురించి మనకు తెలియని ఎన్నో విషయాలను రచయిత చక్కగా వివరించారు. నెల్లూరుకు లోతైన చరిత్ర ఉందని, దానికి సంబంధించిన అనేక విషయాలను సంఘటనలతో సహా వివరించారు. ద్రావిడులు, ఆఫ్రికా నుంచి వచ్చిన తొలి మానవులకు పెన్నా నది పరీవాహకం కేంద్రబిందువైంది. శంకరనారాయణ నిఘంటువు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో! ఆయన రచించిన తెలుగు- ఇంగ్లీషు, తమిళం- ఇంగ్లీషు నిఘంటువులు చాలా ప్రసిద్ధి చెందినవి. శంకరనారాయణ నెల్లూరువాసే. కానీ మద్రాసులో స్థిరపడ్డారు. నెల్లూరుకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఆరో శతాబ్దం నుంచి పల్లవులు, చోళులు, తెలుగు చోళులు, విజయనగర రాజులు, గోల్కొండ నవాబులు, మొగలులు, ఆర్కాటు నవాబులు వంటి ఎన్నో వంశాలు, రాజులు నెల్లూరును పరిపాలించారు. అందులో విజయనగరం రాజులు మూడు శతాబ్దాల పాటు నెల్లూరు ప్రభువులుగా పాలించారు. సింహపురి సీమ అంటేనే ఉద్యమాలకు పుట్టినిల్లు. 1941లో సాగిన వ్యవసాయ కూలీల సమ్మె దేశం దృష్టిని ఆకర్షించింది. 1921 నాటి కల్లు ఉద్యమంలోగానీ, నిన్నటి మద్యపాన నిషేధ ఉద్యమం వెనుకా నెల్లూరు ప్రధాన భూమిక పోషించింది.
   నెల్లూరు చరిత్ర పుస్తకంలో విడదీయలేని పేజీ అంటూ ఏదన్నా ఉందంటే.. అది అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఆ ప్రాంతంతో ఉన్న అనుబంధమే. ప్రత్యేకాంధ్ర కోసం ఆయన ఆమరణదీక్ష చేసి అమరులయ్యారు. గాంధీజీ పిలుపు మేరకు దేవాలయాల్లో దళితులకు ప్రవేశం కల్పించేందుకు అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి. ఆలస్యంగానైనా ఆయన పేరు జిల్లాకు పెట్టడం హర్షించదగ్గ విషయమే. ముగ్గురు గవర్నర్లు పనిచేసిన చరిత్ర ఈ జిల్లాకు ఉంది. 'దేశ భాషలందు తెలుగు లెస్స' అనే చరణం నెల్లూరి వారిదే. నెల్లూరు మండలానికి చెందిన వినుకొండ వల్లభామాత్యుడు 15వ శతాబ్దంలో 'క్రీడాభిరామం' అనే కావ్యంలో ఈ చరణాన్ని వాడారు. అయితే శ్రీకృష్ణదేవరాయులు దానిని వాడుకలోకి తెచ్చారు.
   ఈ పుస్తకంలో ఇంకా ఎన్నో అంశాల గురించి చక్కగా వివరించారు రచయిత ఈతకోట సుబ్బారావు. నెల్లూరు గురించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఈ పుస్తకాన్ని తప్పక చదవాల్సిందే. - స్వర్ణ నెల్లూరు సంగతులు చరిత్ర

రచన : ఈతకోట సుబ్బారావు
పేజీలు : 304
వెల : రూ. 280
ప్రతులకు : 24/1697,
సెకండ్‌ స్ట్రీట్‌, రవీంద్ర నగర్‌,
నెల్లూరు-524004
సెల్‌ : 9440529785