ప్రజాశక్తి - క్యాంపస్
ఆంధ్రప్రదేశ్ వైయస్సార్ యూనివర్సిటీస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వర్సిటీలోని ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆచార్య కె.రాజారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు విధినిర్వహణలో ఒత్తిడికి గురవుతుంటారని, దాని ప్రభావం గుండెపైన ఉంటుందని తెలిపారు. మరో ముఖ్య అతిథి తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకోవడానికి ఉచిత వైద్య శిబిరాలు ఉద్యోగులు, విద్యార్థులకు వరం లాంటివని చెప్పారు. యూ. వి. కార్డియాక్ కేర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ వి. ఎం. వికాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్క ఉద్యోగి గుండె పరిరక్షణపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అప్పుడే ఆరోగ్యవంతంగా ఉంటారని సూచించారు. ఆంధ్రప్రదేశ్ వైయస్సార్ యూనివర్సిటీస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె. మురళిరెడ్డి మాట్లాడుతూ ఉచిత గుండె వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందన్నారు. 205 మంది ఉద్యోగులు, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. బిపి, షుగర్, ఈసీజీ పరీక్షలను నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య వి. శ్రీకాంత్ రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య ఓ. మహమ్మద్ హుస్సేన్, 23వ డివిజన్ కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రాజారెడ్డి, వర్సిటీ ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.










