
* కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: నూతన ఓటర్ల జాబితా కూర్పులో భాగంగా ఫారం-6, 7, 8 కింద వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. నోటీసులు జారీ చేసే ప్రక్రియ, వెబ్సైట్ అందుబాటులోకి రాగానే పూర్తి కావాలని సూచించారు. అప్పటివరకు పూర్తి సన్నద్ధతతో ఉండాలన్నారు. రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, డిఆర్ఒ ఎం.గణపతిరావుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈనెల నాలుగో తేదీ నుంచి ఇవిఎంల వెరిఫికేషన్ చేపట్టి 14వ తేదీ లోగా పూర్తి చేస్తామని కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులతో మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా కార్యక్రమంలో రాజకీయ పార్టీలు సమర్పించిన క్లయిమ్ల అభ్యంతరాలు, అనోమలిస్, చనిపోయిన, డూప్లికేట్, బదిలీ చేయబడిన, నకిలీ ఓటర్ల జాబితాల వెరిఫికేషన్, ఎపిక్ కార్డు జనరేషన్ తదితర ఆన్లైన్లో పెండింగ్ ఉన్న అంశాలను వెంటనే డిస్పోజ్ చేయాలని చెప్పారు. నియోజకవర్గ స్థాయిలో ప్రతి వారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి చేపడుతున్న కార్యక్రమాలను వివరించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో జెడ్పి సిఇఒ ఆర్.వెంకట్రామన్, ఉప కలెక్టర్లు మురళీకృష్ణ, జయదేవి, సుమబాల, ఆర్డిఒ బి.శాంతి తదితరులు పాల్గొన్నారు.