Sep 26,2023 21:53

తహశీల్దార్‌ కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌

* సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌
ప్రజాశక్తి - కోటబొమ్మాళి: 
సమగ్ర భూ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని టెక్కలి సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌ ఆదేశించారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించిన ఆయన రెవెన్యూ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2003కు ముందు డి-పట్టా భూములు పొందిన వారికి హక్కు పత్రాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతం చేపడుతున్న భూ సర్వే ద్వారా వాస్తవ సాగు రైతులకు భూ హక్కులు సంక్రమించేలా పాస్‌ పుస్తకాలు జారీ చేస్తున్నట్లు చెప్పారు. వ్యాబ్‌లో సమస్యల కారణంగా కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయని, ఆలస్యమైనా వాటినీ పూర్తి చేస్తామన్నారు. మండలంలో 43 రెవెన్యూ గ్రామాలు ఉండగా, ఇప్పటికే 13 రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి చేసి భూ హక్కు పత్రాలను అందజేసినట్లు వివరించారు. మిగిలిన 30 గ్రామాలలో ప్రస్తుతం ఏడు గ్రామాల్లో రీ సర్వే చేపడుతున్నామన్నారు. నెట్‌ సమస్యల వల్ల 27 గ్రామాలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటివనీ త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సమావేశంలో తహశీల్దార్‌ జామి ఈశ్వరమ్మ, సిఎస్‌డిటి కె.రాము, డిప్యూటీ తహశీల్దార్‌ ఆర్‌.మధు, సిబ్బంది ఉన్నారు.