
ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్: మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ తెలుగుశక్తి ఆధ్వర్యాన చేపట్టిన ప్రజా చైతన్య యాత్రను మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అరసవల్లి ఆలయ ప్రాంగణం వద్ద గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగుశక్తి అధ్యక్షులు బి.వి రామ్తో కలిసి ఆమె మాట్లాడుతూ సిఎం జగన్ను పొగడ్తలతో ప్రసన్నం చేసుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసిపి నాయకులు భజన కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పారు. ఆ కార్యక్రమానికి సామాజిక సాధికార బస్సు యాత్రగా పేరు పెట్టారని విమర్శించారు. ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీలకు ఏం న్యాయం చేశారని యాత్ర చేపట్టారని ప్రశ్నించారు. తల్లి, చెల్లికే న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకు ఏం చేస్తాడన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు మాదారపు వెంకటేష్, కె.సుశీల, కె.కమల, కె.రాము తదితరులు పాల్గొన్నారు.