Jun 09,2023 22:26

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌ : జిల్లాలో శ్రీసత్యసాయి తాగునీటి పథకం ద్వారా ప్రజలకు తాగునీరు అందించి సమస్య లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో శ్రీ సత్యసాయి వాటర్‌ సప్లై ప్రాజెక్టు బోర్డు 51వ ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌, శ్రీసత్యసాయి వాటర్‌ సప్లరు బోర్డ్‌ చైర్మన్‌ ఎమ్‌.గౌతమి మాట్లాడుతూ జిల్లాలో శ్రీసత్యసాయి తాగునీటి పథకం ముఖ్యమైన ప్రాజెక్ట్‌ అన్నారు. ప్రజల దాహార్థిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన ఈ పథకం ద్వారా జిల్లాలో నీటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలన్నారు. ఎక్కడైనా మోటార్‌ పంప్‌లు, పైపులు చెడిపోయి ఉంటే వేగవంతంగా మరమ్మతులు చేయించి నీటి సరఫరా ఆగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సక్రమంగా మెయింటెనెన్స్‌ చేసి శ్రీసత్యసాయి వాటర్‌ స్కీంకు పూర్వ వైభవం తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా 2022-23, 2023-24వ వార్షిక జమ, ఖర్చులు, వివిధ పనులపై బోర్డు మీటింగ్‌లో అప్రూవల్‌ తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఛైర్‌పర్సన్‌ గిరిజమ్మ, జెడ్పీ సిఇఒ భాస్కర్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఇ ఇషాన్‌బాషా తదితరులు పాల్గొన్నారు.