Oct 24,2023 23:47

చిలకలూరిపేట: స్థానిక 52 ఎకరాల టిడ్కో గృహ సముదాయం సమస్యల మయంగా మారిందని నియోజకవర్గ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు మద్దుమాల ప్రసన్నాంజనేయులు, పల్నాడు జిల్లా యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ఇంటూరి భవాని వెంకటేష్‌ విమర్శించారు. స్థానికంగా ఉన్న 52 ఏకరాల్లో మంగళవారం వారు సందర్శించారు. ఈ సందదర్భంగా వారు మాట్లాడుతూ గృహ సముదాయాల్లో తాగునీరు రావడం లేదని, ఒకవేళ వచ్చినా రంగుమారిన నీరు వస్తోందని అన్నారు. మురుగునీరు పోయే పరిస్థితి కూడా లేదని విమర్శించారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ విఫలమైన కారణంగా మురుగునీరు రోడ్లపైకి చేరి దుర్వాసన వెదజల్లుతోందని అన్నారు. పురపాలక సంఘ అధికారులు తక్షణమే స్పందించి తగు చర్యలు చేపట్టాలని, ప్రజా ఆరోగ్యా న్ని కాపాడాలని డిమాండ్‌ చేశారు. నివాస గృహాల మధ్య ఉన్న పెద్ద పెద్ద చెట్లు, ముళ్ళ చెట్లు ఉండటంతో అడవిని తలపిస్తోందని, విషసర్పాలు సంచ రిస్తున్నాయని, ఇప్పటికే ఇద్దరు పాముకాటుకు గురైన విషయాన్ని స్థానికులు, యువజన కాంగ్రెస్‌ నాయకులకు చెప్పారని అన్నారు. ప్రత్యేక శానిటరీ సిబ్బందిని నియమించాలని, జంగిల్‌ క్లియరెన్స్‌ చేపట్టాలని మున్సిపల్‌ కమిషనర్‌, జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి ఫలితం లేదని అన్నారు. స్థానిక ప్రజలతో కలిసి యువజన కాంగ్రెస్‌ కార్యకర్తల ఆధ్వర్యంలో జంగిల్‌ క్లియరెన్స్‌ కార్యక్రమం త్వరలో చేపట్టనున్నట్లు చెప్పారు. సందర్శించిన వారిలో నియోజకవర్గ యువజన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు ఎ.ఈశ్వర్‌, కారుచోల స్వప్న కుమార్‌, సిహెచ్‌ నాగరాజు, జె.రాజశేఖర్‌ రెడ్డి, షేక్‌ మహబూబ్‌ సుభాని, వి.సుధాకర్‌ పాల్గొన్నారు.