
ప్రజాశక్తి-అనకాపల్లి
హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్.స్వామినాథన్ మృతి దేశానికి తీరని లోటని పలు సంఘాల నాయకులు అన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కార్మిక కర్షక నిలయంలో స్వామినాథన్ సంస్మరణ సభ నిర్వహించారు. ముందుగా డాక్టర్ స్వామినాథన్ చిత్రపటానికి రైతు సంఘం నాయకులు ఎ.బాలకృష్ణ, కర్రి అప్పారావు, కాళ్ల తేలయ్య బాబు, కోరిబిల్లి శంకర్రావు, కిసాన్ కాంగ్రెస్ నాయకులు కాళ్ల ఏడుకొండలు, సిఐటియు, ఎఐటియుసి నాయకులు గనిశెట్టి సత్యనారాయణ, వైయన్ భద్రం తదితరులు పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ తిండిగింజలకు విదేశాలపై ఆధారపడే దుస్థితి నుండి దేశాన్ని రక్షించి ఆహార ధాన్యాల కొరతను తీర్చిన అనేకమంది శాస్త్రవేత్తల్లో డాక్టర్ స్వామినాథన్ అగ్రగణ్యులని పేర్కొన్నారు. ఆయన కృషి ఫలితంగానే ఆహార కొరత అధిగమించి మిగులుకు చేరుకున్నామన్నారు. భారత ప్రభుత్వం పరిశోధన కేంద్రాలను పటిష్టపరిచి దేశ ప్రజలందరి ఆహార అవసరాలను తీర్చే విధంగా చిత్త శుద్ధితో ప్రణాళికల రూపొందించి అమలు చేయాలని కోరారు. అందుకు డాక్టర్ స్వామినాథం చేసిన సిఫార్సులను బిజెపి కేంద్ర పాలకులు తూచా తప్పకుండా అమలు చేసి సంక్షోభాలను, వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించాలని డిమాండ్ చేశారు. కాని ఆ దిశగా మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతుల ఆత్మహత్యలను నివారించే విధంగా అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు ప్రకటించి చట్టం చేయాలని, రుణ సౌకర్యం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కల్పించాలని డిమాండ్ చేశారు.