
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : మద్యం దుకాణంలో మద్యం విక్రయించిన నగదు బ్యాంకుకు చెల్లించినట్లుగా అధికారులకు నకిలీ స్లిప్పులు చూపించి రూ.8 లక్షలను స్వాహా చేసిన ఘటన పల్నాడు జిల్లాలోని నరసరావుపేట మండలం కోటప్పకొండ యుటి వద్ద దుకాణంలో బుధవారం వెలుగు చూసింది. నగదు గోల్ మాల్ చేసింది ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్వైజర్గా పని చేస్తున్న సంగీతరావుగా ఎక్సైజ్ పోలీసులు నిర్ధారించారు. సంగీతరావు ప్రస్తుతం పరారీలో ఉండగా ఆయన నరసరావుపేట మండలంలోని వైసిపి కీలక నేతకు ప్రధాన అనుచరుడని స్థానికులు చెబుతున్నారు. అధికారులకు బ్యాంకు నకిలీ చలానాలు చూపించి మూడ్రోజులపాటు అమ్మిన మద్యం తాలూకు డబ్బును సొంతానికి తీసుకున్నాడని, దీనిపై కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్నామని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. సంగీతరావు కుటుంబ సభ్యుల కదలికలపై ఎక్సైజ్ పోలీసులు నిఘా ఉంచారు. ఇదిలా ఉండగా గురజాల నియోజకవర్గం పులిపాడు ప్రభుత్వ మద్యం దుకాణంలో 50 కేసుల మద్యం, రూ.3 లక్షల నగదు మాయమైనట్లు ఎక్సైజ్ పోలీసులు నిర్ధారించారు. నిందితుడు ఇటీవల హత్యకు గురైన కునిరెడ్డి కష్ణారెడ్డిగా తోటి ఉద్యోగులు చెబుతున్నారు.