
ప్రజాశక్తి-అనకాపల్లి
5 సం. నుండి 18 సం.ల బడి ఈడు పిల్లలు ప్రతి ఒక్కరూ ఎక్కడైనా బడిలోనే చదువుతూ ఉండాలని, విద్యార్థులకు సంబంధించిన గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జిఈఆర్)(స్థూల నమోదు నిష్పత్తి) శత శాతంగా ఉండేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో బడి బయట ఉన్న 2141 విద్యార్థులు నవంబర్ 10వ తేదీ నాటికి బడిలో లేదా ఓపెన్ స్కూల్లో జాయిన్ చేయాలని, చదువుపై ఆసక్తి లేని వారిని వృతి విద్య శిక్షణలో చేర్పించాలని స్కిల్ డెవలప్మెంట్ అధికారిని ఆదేశించారు. జిల్లాలో స్టూడెంట్ ఇన్ఫో పోర్టల్ నమోదు కానీ 11560 విద్యార్థుల వివరాలు నవంబర్ 10వ తేదీ లోపల ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. నవంబర్ 3వ తేదీన ఆంగ్ల మాధ్యమంలో జరిగే ఎస్ఇఏఎస్ పరీక్షకు సిద్దమవుతున్న విద్యార్థులకు అవగాహన తరగతులు, వీలైనన్ని ఎక్కువ మాక్ టెస్ట్స్ నిర్వహించాలని ఎంఈఓలను ఆదేశించారు. టిఎఆర్ఎల్, ఎల్ఐపి, డిజిటల్ తరగతులు, డిజిటల్ మధ్యమాల వినియోగంపై కచ్చితమైన పర్యవేక్షణ చేయాలని సూచించారు. 10వ తరగతి, ఇంటర్మీడియేట్ విద్యార్థులకు రేమెడియల్ తరగతులు నిర్వహించి శత శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా కృషి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో, డీఈవో వెంకట లక్ష్మమ్మ, డివైఇవో సుజాత, ఎ.డి(స్కీమ్స్) రవిబాబు, స్కిల్ డెవలప్మెంట్ అధికారి చాముండేశ్వర రావు, జిల్లాలోని ఎంఈఓలు, సిఆర్పిలు పాల్గొన్నారు.