Jun 03,2023 22:22

రహదారి విస్తరణ పనులను పరిశీలిస్తున్న మేయర్‌ వసీం

            ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌  నగరంలోని లక్ష్మీనగర్‌ నాగుల కట్ట వద్ద రూ.1.41కోట్లతో చేపడుతున్న బీటీ రోడ్డు పనులను మేయర్‌ మహమ్మద్‌    వసీం శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా సిఎం జగన్‌ సహకారంతో నగరంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ముఖ్యంగా ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రహదారులు, డ్రెయినేజీలు, కల్వర్టుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామన్నారు. అంతేకాకుండా నగర చరిత్రలోనే తొలిసారిగా నగరాభివృద్ధికి స్పెషల్‌ గ్రాంట్‌ రూ.25కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే స్పెషల్‌ గ్రాంట్‌ రూ.25 కోట్లు పనులకు టెండర్ల పక్రియ పూర్తయిందని త్వరితగతిన పనులు పూర్తి చేస్తామన్నారు. నగరంలో శరవేగంగా అంతర్గత రహదారుల విస్తరణ పనులు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతకుంట మధు, ఖాజా, డిఇలు చంద్రశేఖర్‌, రాంప్రసాద్‌రెడ్డి, ఎఇ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.