May 03,2021 12:08

    శాస్త్రీయ, సామాజిక, ఆధ్యాత్మిక, నేర, సైంటిఫిక్‌ అంశాలు కలగల్సిన ఒక కల్పనే ఈ కొత్తప్రపంచం నవల. మతాలు, దేవుళ్లు లేని ప్రపంచం మనం ఉహించగలమా? ఇవన్నీ లేకుండా ఏ శక్తి, స్వార్థంతో నిండిపోయిన మానవ జాతిని నియంత్రించగలదు? దేవుడున్నాడన్న భయమే మానవాళిని మంచివైపు నడిపిస్తుందని ఓ నమ్మకం. అయితే అది ఒకప్పటి మాట! ప్రపంచం మొత్తం ప్రస్తుతం గ్లోబల్‌ విలేజ్‌గా మారిపోయింది. పాస్‌పోర్టులు, వీసాలు అవసరం లేకుండానే ప్రపంచాన్ని చుట్టేయొచ్చు. అంతర్జాలాన్ని అరచేతిలో పెట్టుకుని, టెక్నాలజీ సాయంతో ఏ విషయాన్ని క్షణాల్లో అధ్యయనం చేయొచ్చు. ప్రపంచంలోని నాలుగు ప్రధాన మతాల వైఖరిని, అవి సృష్టించుకున్న దేవుళ్లను నిష్పక్షపాతంగా చర్చించి, వారి గ్రంథాల నుంచి తీసుకున్న అనేక విషయాలను వివరిస్తూ ఎవరినీ నొప్పించకుండా కేవలం నిజాలను మాత్రమే మన ముందు ఉంచిన ఒక విశ్లేషణే ఈ కొత్త ప్రపంచం. క్రమేణా ఈ మానవాళి సరిహద్దులను తొలగించి ఒక రహస్య పథకంతో మానవత్వపు చర్యలవైపుకి, ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఆ విషయాలను షేక్‌ అహమద్‌ బాష చాలా చక్కగా బ్యాలెన్స్‌ చేస్తూ విశ్లేషించారు.
   వాస్తవానికి 2015లోనే రచయిత ఈ నవల రాసినప్పటికీ దీనిని అచ్చువేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. పైగా అనేక పత్రికల వారు ఈ నవలను ప్రచురించడానికి ఇష్టపడలేదు. కొందరైతే ఏకంగా తమ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పడంతో మరుగున పడిపోయింది. 2020లో తరిమెల అమరనాథ్‌రెడ్డి సహకారంతో ఈ నవలను పాఠకులకు 2021లో చేరువచేశారు.
   ఈ మధ్య కాలంలో జరిగిన డిఎన్‌ఏ పరిశోధనల ప్రకారం మొదట మానవజాతి చీకటి ఖండమనే ఆఫ్రికా నుంచే గమనం సాగించిందని, భారత ఉపఖండానికి ప్రవేశద్వారమైన హరప్పా, మహంజోదారో గుండానే ముందుగా ద్రావిడులు వచ్చారని, ఆ తర్వాత ఆర్యులనే జాతి ఈ ఖండంలో ప్రవేశించిందని ఈ డిఎన్‌ఏ పరిశోధనలు, కార్బన్‌ డేటింగ్‌ ద్వారా జరిపిన జియోలాజికల్‌ పరిశోధనలు చెబుతున్నాయి. మధ్య ఆసియా నుంచి భారత ఉపఖండంలో ప్రవేశించిన ఈ నాగరికతలే మనకు వేదాలు, ఉపనిషత్తులు, సంస్కృతం అనే భాషనూ తెచ్చాయి. కలిసి ఉన్న మానవులను తెలివైన మానవులు అనేక కులాలు సృష్టించి విభజించి తమ స్వార్థం చూసుకున్నాయి. ఈ స్వార్థపూరిత వివక్ష ఇప్పుడు మరింత పెరిగి అది సామ్రాజ్య వాదంగా మతవాదంగా కులాల విభజనగా మారి దోపిడీ వ్యవస్థకు దారితీస్తుంది. ఇనుపయుగానికి, ప్రస్తుత కాలానికి మధ్య రెండు వ్యవస్థలు మానవులను సమానత్వం వైపు మళ్లించే ప్రయత్నాలు చేశాయి. మొదటిది బౌద్ధమతం, రెండోది కమ్యూనిజం. అయితే బౌద్ధమతం మానవత్వ వాదాన్ని వినిపించి దోపిడీని అరికట్టిన మతం. స్వర్గనరకాల భయం నుంచి, దేవుళ్ల గుప్పెట నుంచి, కులాల నుంచి మూఢవిశ్వాసాల నుంచి ఈ మానవాళిని విడుదల చేసిన ఏకైక మతం. ఆ మతం చూపించిన దారికి ఆకర్షితులై చక్రవర్తుల నుంచి సామాన్యుల వరకూ సామ్రాజ్యాల నుంచి సార్వత్రిక ప్రపంచం వరకూ నడిచారు. కానీ మానవుల్లో ఉన్న స్వార్థపరుల కుత్సిత బుద్ధికి మనదేశం నుంచి ఆ మతం వెలివేయబడింది. ఆ మతం తూర్పు ఆసియా దేశాల్లో ఉన్నప్పటికీ బుద్ధుని ఆశయాల ప్రకారం అభివృద్ధి కాలేదు. ఇక ఈ మానవుల దిద్దుబాటు చర్యలవైపు నడిపించాలనే రెండోది కమ్యూనిజం. అది కూడా స్వార్థ మానవుల కుతంత్రాలతో, దోపిడీ వ్యవస్థతో విరాజిల్లే పెట్టుబడిదారీ రాజ్యాల కుట్రలతో కూలిపోయింది. ప్రజలు ఎలాంటి విప్లవ విధానాలవైపు మళ్లకుండా కార్పొరేట్‌ ప్రపంచం తగు జాగ్రత్తలు తీసుకుంటోంది.
   చివరికి మనకు తెలిసిన ప్రకృతిని స్వార్థంతో ఎలా వికృతం చేస్తున్నామో వివరిస్తూ.. అనేక గ్రంథాలు, దినపత్రికల్లో వచ్చిన వ్యాసాలు, అంతర్జాలంలో సేకరించిన సమాచారంతో రచయితన ఈ నవలను రచించారు. ఆ వివరాలు పూర్తిగా తెలుసుకోవాలంటే కొత్త ప్రపంచం మిషన్‌ హ్యూమేన్‌ చదవాల్సిందే...

కొత్త ప్రపంచం
మిషన్‌ హ్యూమేన్‌
రచన : షేక్‌ అహమద్‌ బాష
పేజీలు : 172
వెల : రూ.120
ప్రతులకు : విశాలాంధ్ర బుకహేౌస్‌
ప్రజాశక్తి పబ్లిషింగ్‌ హౌస్‌ అన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉంటుంది.