
పాటలు పాడాలంటే సంగీతం తెలియాలా ? గొంతు సవరించుకోవాలంటే సరిగమల సంగతులపై పట్టుండాలా? అంటే.. ఇవేమీ అక్కర్లేదు అంటోన్నారు ఈ మట్టిలో మాణిక్యాలు. సంగీతంలో ఎలాంటి శిక్షణా లేకుండానే స్వరాలతో వారు సరిగమలు పాడేస్తున్నారు. గమకాలతో గమ్మత్తు చేయగలరు. అదెలా అంటారా? అయితే వారి గురించి చెప్పాలంటే చాలానే ఉంది. ఈ మధ్య జరిగిన 2021 'సరిగమప' హిందీ ఆడిషన్స్ అలాంటి అరుదైన వారితోనే జరిగింది. అందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ. వారి పాట ప్రపంచ నలుమూలలకూ చేరి, ఆ నోటా.. ఈ నోటా మారుమోగాలి. రెక్కాడితేగానీ డొక్కాడని స్థితి నుంచి వచ్చిన వారు తమ గాన మాధుర్యంతో అలరించేందుకు వేదికపైకి వచ్చారు. ఆ ఆణిముత్యాల గురించే ఈ ప్రత్యేక కథనం.
పాటకు నిర్మాణాత్మకమైన రూపాలు చాలానే ఉంటాయి. పాటకు తగ్గ గాయకులు. గాయకులకు తగ్గ పాట.. అన్నట్టుగా.. పాటలు పాడటంలో ఒక్కొక్కరిదీ ఒక్కో ప్రత్యేకత. కొందర్ని చూస్తే ముచ్చటేస్తుంది. కొందరు పాడుతూ ఉంటే.. మనకూ అచ్చంగా అలానే పాడాలనిపిస్తుంది. పాటలో పదాలు గుండెల్ని హత్తుకొని, పలవరించాలంటే మైమరిపించే స్వర సాకారం ఎంతో అవసరం. అయితే అంతటి మధురస్వరం అందరిలోనూ ఉండదు. కొందరే పాటను హృదయానికి హత్తుకునేలా గానం చేయగలరు. అయితే ఎంతో టాలెంట్ ఉన్నా బయట ప్రపంచానికి తెలిసే అవకాశం లేక ఎందరో కళాకారులు మరుగున ఉండిపోయారు.. ఉండిపోతున్నారు. కానీ వీరి పరిస్థితులు అందుకు పూర్తిగా భిన్నం. వీరి టాలెంట్కు అవకాశం అంది వచ్చింది. కొన్ని వేదికలు అలా ప్రత్యేకంగా ఇలాంటి సృజనకు పట్టం గడుతున్నారు. అలాంటి వేదికల్లో జీ 'సరిగమప' ఒకటి. ఈ వేదిక నుండి అత్యుత్తమ వర్ధమాన గాయకులు వెలుగులోకి వచ్చారంటే అతిశయోక్తి కాదు. ప్రతిభ ఉన్నవాళ్లు పోటీకి దిగడమంటే అందులో విజేతలు కావడం ప్రధానం కాదు. అక్కడికి చేరుకోవడమే ఒక విజయం అనేది అందరం గమనంలో ఉంచుకోవాలి. అందులోనూ ఇలాంటివారు వేదికలు ఎక్కగలగడం అంటే.. సంగీతంలోనే కాదు.. జీవితంలోనూ గెలవడమే. ఈ వేదికలపై పాడే అనేకమంది చిన్నారుల నుండి యువత వరకూ విజేత అయినా కాకపోయినా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల నుండి ఎలాంటి భాషా భేదాలు, అంతరాలూ లేకుండా స్వచ్ఛమైన ప్రేమాభిమానుల్ని గెలుచుకోవడం, ఏ అవార్డుకూ సరితూగదు. ఈసారి సరిగమప ఓ ప్రత్యేకత ఉంది. అందులో పాల్గొనే వారంతా పేద కుటుంబాల నుండి వచ్చినవారే అత్యధికం.
అమ్మంటేనే శక్తిశాలీ..!
ఏ రంగంలోనైనా అమ్మాయిలకు విజయం అంత సులువేమీ కాదు. వారికి చిన్నప్పటి నుండి ఎన్నో కలలుంటాయి. అయితే వారికి అంతకుమించి అడ్డంకులు ఈ వ్యవస్థలో ఉన్నాయి. అందుకే స్త్రీలకు ప్రతిరోజూ ఒక యుద్ధమే. వివాహం తర్వాత అమ్మాయిల కలలు, ఆశయాలు సమాధులు అవుతాయనేది ఎక్కువమంది విషయంలో మనం చూశాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువతి అందుకు పూర్తిగా భిన్నం. 'నీకేం కాదులే... నేనున్నా నీ వెనుక' అంటూ భరోసా ఇవ్వగలిగే అద్భుతమైన బంధం ఆమెతో పెనవేసుకుంది. ఆ బంధం పేరే దేవేంద్ర. అసలు ఇతనెవరో తెలుసుకోవాలంటే సరిగమప ఆడిషన్స్లో ఏమి జరిగిందో తెలుసుకోవాలి.
ఆడిషన్స్లో మూడో కంటెస్టెంట్ అయిన ఢిల్లీకి చెందిన సంజనాభట్ తన ఐదునెలల పసిబిడ్డతో సహా వేదిక మీదకు వచ్చింది. మొదట్లో అందరూ ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. తనను తాను పరిచయం చేసుకుంది. మీరు ఎవరి సాయంతో ఈ ఆడిషన్స్కు వచ్చారని న్యాయనిర్ణేతలు అడిగిన ప్రశ్నకు నా భర్త (దేవేంద్ర) తో కలిసి వచ్చానని బదులిచ్చారు. అతన్నీ వేదిక మీదకు పిలవమని చెప్పగానే 'దేవాన్షికీ పాప' అంటూ ఆమె పిలవడం అందరికీ ఆనందం కలిగించింది. అంతే ఒక్కసారిగా హాలంతా నవ్వులే నవ్వులు... 'ఇప్పుడు మీ భర్తను ఏమని పిలిచారు?' అంటూ న్యాయనిర్ణేతలు అడగగానే.. ఆమె కాస్త నవ్వుతూ 'దేవాన్షికీ పాప!' అని చెప్పడంతో.. ఆ క్షణంలో ఆ దంపతుల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. వాస్తవానికి ఆ సంతోషం వెనుక ఎన్నెన్నో కష్టాలున్నాయనే విషయం అక్కడున్న వారెవ్వరికీ తెలియదు.
సంజన ప్రస్తుత కుటుంబంలో సుమారు 14 మంది ఉంటారు. వారంతా కలిసి రెండు గదుల్లోనే నివసిస్తారు. రాత్రివేళలో సంజన దంపతులు వంటగదిలోనే నిద్రిస్తారు. మిగతా కుటుంబసభ్యులు హాలులో పడుకుంటారు. వారి ఇంటి గదులు ఇరుకుగా ఉండొచ్చుగానీ, వారి మనసులు చాలా విశాలమైనవి. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం అయినా ఆదర్శభావాలున్న వ్యక్తులు వారు. పెళ్లి తర్వాత ఆమె గ్రాడ్యుయేట్ పూర్తిచేసేలా కుటుంబసభ్యులే ప్రోత్సహించారు. అంతేకాదు నేడు 'సరిగమప' పోటీలకూ ఆమె రావడం వెనుక భర్తతోపాటు అత్తామామల మద్దతు ఎంతగానో ఉందని సంజన అక్కడ వివరించింది. వారి జీవిత కాలంలో ముంబై రావడం ఇదే మొదటిసారంటూ దేవేంద్ర చెప్పడం అందరినీ ఆశ్చర్యంతో పాటు కాస్త భావోద్వేగం కలిగించింది. ప్రస్తుతం వారికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో.. సంజన తన గురించి పరిచయం చేసుకున్న తర్వాత న్యాయనిర్ణేతలు పాట పాడమని కోరతారు. ఆమె తన చేతిలో ఉన్న పాపను భర్తకు ఇచ్చి, పాడటానికి సిద్ధమౌతూ ఉంటుంది. అదే సమయంలో దేవేంద్ర తిరిగి వేదిక దగ్గరకు వచ్చి, పాప తనతో ఉండటం లేదంటూ సంజనకు ఇచ్చేస్తాడు. వాస్తవానికి అది ఆమెకు లైఫ్ అండ్ డెత్ సమస్య. ఆమె ఇన్నాళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కే క్షణాలు అవి. తన స్వరాన్ని ప్రపంచానికి తెలిపే అరుదైన అవకాశం. ఏమాత్రం ఏకాగ్రత కోల్పోయినా వచ్చిన అవకాశం చేజారిపోతుంది. అయినా ఆమె అవేమీ పట్టించుకోలేదు.
నవ్వుతూ తన పాపను చేతుల్లోకి తీసుకుంది. ఒక చేత్తో పాపను, మరోచేత్తో మైకును పట్టుకుని పాట పాడతానంటూ న్యాయనిర్ణేతలను అనుమతి కోరింది. అందుకు వారు నీకు ఇబ్బంది లేకపోతే మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదని చెబుతారు. అంతే ఆమె పాడటం మొదలుబెట్టింది. ముద్దులొలికే చిన్నిపాప తల్లిని ఇబ్బంది పెట్టకుండా ఆమెకు సహకరించింది. అలా తన గానంతో అక్కడున్న వారందరినీ మంత్ర ముగ్ధుల్ని చేసింది సంజన. ఆ దృశ్యం చూసిన వారంతా ఒక్కసారిగా భావోద్వేగానికి గురికాకుండా ఉండలేరు. ముఖ్యంగా న్యాయనిర్ణేతల్లో ఒకరైన విశాల్ దాద్లానీ అమ్మంటేనే శక్తిశాలీ అంటూ ఆమెను కొనియాడారు. బిడ్డ మెడలోనే మెడల్ వేసి, సంజన సెలెక్ట్ అయినట్లు ప్రకటించారు. 'పెళ్లి అయిన తర్వాతా భార్య ఇష్టాయిష్టాలను, ఆమె ఆకాంక్షలను ఎలా గౌరవించాలో ప్రతి ఒక్కరూ దేవేంద్రను చూసి నేర్చుకోవాలి' అని న్యాయనిర్ణేతలు చెప్పడం, యావత్తు లోకం ఆహ్వానించాల్సిన విషయం.

ఆ రోజే నిర్ణయించుకున్నా..!
లఖింపూర్ ఖేరీకి చెందిన సచిన్కుమార్ వాల్మీకి 2016 'సరిగమప' ఫైనలిస్టులు 12 మందిలో స్థానం దక్కించుకున్నాడు. అతనూ ఓ పారిశుధ్య కార్మికుని కుమారుడు. ఏడేళ్ల వయసు నుంచే కూనిరాగాలు తీస్తున్న అతనిలోని టాలెంట్ను తల్లిదండ్రులు గుర్తించారు. 'నేను మొదట 'క కరోన్ సజ్నీ...' పాట పాడాను. అప్పుడు పాటైతే పాడగలిగాను, కానీ ఎక్స్ప్రెషన్స్ అంత బాగా ఇవ్వలేకపోయాను. గంటల తరబడి అద్దం ముందు నిలబడి, పాడటం అలవాటు చేసుకున్నా. సంగీతం నేర్పించేంత ఆర్థిక పరిస్థితి నా కుటుంబానికి లేదు. అందుకే ఒక రెస్టారెంట్లో పనిచేస్తూ సంగీత పాఠశాలలో చేరాను. నెలకు రూ.350 ఫీజు. ఒకసారి రూ.50 తక్కువ అయ్యిందని నన్ను క్లాసులో నుంచి బయటకు పంపారు. ఆ రోజే నేను నిర్ణయించుకున్నా. ఏదో ఒకరోజు పదిమంది గౌరవించేలా నిలబడాలి అని. మా ఇంటికి దగ్గర్లో ఓ పాడుబడ్డ గది ఉండేది. వర్షం వస్తే ఆ రూమంతా కారుతూ ఉండేది. ఉదయం నాలుగు గంటల నుండి ఆరు వరకూ అక్కడే ప్రాక్టీస్ చేసేవాడిని. కీబోర్డ్, తబలా, ఢోలక్, డ్రమ్స్ ఎలా వాయించాలో గురువు లేకుండానే నేర్చుకోగలిగా. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పెద్దగా చదువుకోలేకపోయాను. సంగీతాన్నీ సరిగ్గా నేర్చుకోలేకపోయాను. నాన్నకు ఆరోగ్యం బాగాలేని రోజుల్లో ఆయనకు బదులుగా వీధులను శుభ్రం చేసేవాడిని. ఒక స్థాయికి రాగానే నా తల్లిదండ్రుల పేర అనాధాశ్రమం నిర్మించి, అందులో సంగీతం నేర్చుకొనేలా అవకాశం కల్పించాలనేది నా కోరిక. ఈ పోటీల్లో నేను గెలిచినా, ఓడినా ఫర్వాలేదు. సంగీత గురువుల నుంచి మార్గదర్శకత్వం పొందగలిగితే చాలు' అంటూ అప్పట్లో చెప్పుకొచ్చాడు సచిన్. అతనే 2021 'జీ సరిగమప' ఆడిషన్స్లో మొదటి కంటెస్టెంట్. అతని పాటను మెచ్చుకున్న న్యాయనిర్ణేతలు వేదికపైకి వెళ్లి, అతన్ని ఎత్తుకుని వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు.

పాటే జీవితం ఇచ్చింది !
జైపూర్కు చెందిన అజ్మత్ హుస్సేన్ 2011లో పిల్లల పాటల రియాలిటీ షో సరిగమప లిటిల్ ఛాంప్స్ విజేత. 2013 వరకూ అజ్మత్ అనేక ప్రదర్శనలు చేశాడు. ఆ తర్వాత అతి తక్కువకాలంలోనే చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. 'నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను. చిన్నప్పటి నుంచే ఆరుగురు తోబుట్టువుల బాధ్యతను చూసుకోవాల్సి వచ్చింది. వారందరికీ నేనే ఆధారం. 2011లో గెలిచిన తర్వాత చాలా షోలు చేశాను. పేరుతో పాటు నాలో అహంకారం పెరిగింది. ఎవరినీ లెక్కచేయలేదు. డ్రగ్స్, పొగాకు నమలడం మొదలెట్టాను. 2013 తర్వాత అసలు చదువు మీద శ్రద్ధ పెట్టలేదు. నా చుట్టూ ఉన్నవారు గొంతు బాగోలేదంటూ ఎప్పటికప్పుడు నాలో నిరుత్సాహాన్ని నింపారు. దాంతో ఒకానొక సమయంలో నా గొంతును నేనే అసహ్యించుకున్నా. సరిగమప 2010 విజేత సల్మాన్ అలీ గురించి తెలుసుకున్నా. నాలో చాలా మార్పు వచ్చింది. నిరుపేద కుటుంబంలో జన్మించిన అతను ఎన్నో ఆటుపోట్ల మధ్య లక్ష్యాన్ని చేరుకోగలిగాడు. అతనిని చూసిన తర్వాత నేను మరోసారి ఎందుకు పాడటానికి ప్రయత్నించకూడదు అనిపించింది. ఇండియన్ ఐడల్ 11 ఆడిషన్స్కూ వెళ్లాను. గతంలోలా పాడలేకపోయాను. అయినా న్యాయనిర్ణేతలు 2020లో నేను మనిషిలా మారడానికి మరో అవకాశం ఇచ్చారు' అన్నాడు అజ్మత్. ప్రస్తుతం అతను చాలా షోలు చేస్తున్నాడు.

అమ్మతో కచేరీలు చేస్తూ..!
జైపూర్కు చెందిన ఆకాంక్ష రావు మరో కంటెస్టెంట్. ఐదేళ్ల వయస్సులోనే తండ్రిని కోల్పోయింది. అమ్మమ్మ ఇంట్లోనే పెరిగి పెద్దవుతోంది. మేనమామలు రాజేంద్రకుమార్, చౌత్మల్ ఆమె గురువులు. ఆమె చెల్లి వర్షనూ పాటలు బాగా పాడుతుంది. అలాగే తమ్ముడు సిద్ధార్థ అద్భుతంగా తబలా వాయిస్తాడు. ఈ పిల్లల ముగ్గురి సహకారంతో ఆకాంక్ష తల్లి చంద్రకళ కచేరీలు ఇస్తూ పిల్లలను పోషించుకుంటూ జీవిస్తున్నారు. ఆర్థికంగా నిరుపేద కుటుంబం వారిది. కొందరు సామాజిక కార్యకర్తల సాయంతో ఆమె ఈ స్థాయికి రాగలిగింది. ఆకాంక్ష గతంలో సోనీ ఛానల్ ప్రోగ్రాం 'సూపర్ స్టార్ సింగర్'లో పాల్గొంది. ఇప్పుడు 'జీ సరిగమప' 2021కి ఎంపికై, పాడిన పాటకు న్యాయనిర్ణేతలు ఫిదా అయ్యారు. అలనాటి హిందీ సంగీతజ్ఞులు సాక్షాత్కరించారని కొనియాడారు. ఆకాంక్షకు కొత్త సినిమాలు, హీరోలు తెలియదంటూ.. ఫేస్బుక్, ఇన్స్ట్రాగ్రామ్ వంటివి తెలియవంటూ చెప్పగానే ఆమె సాంకేతికతకు ఎంత దూరంలో ఉన్నదీ అందరినీ ఆశ్చర్యం కలిగించింది. ఆమె ఆర్థికపరిస్థితులు.. అలాంటి సౌకర్యాల లేమి అందుకు కారణమన్నది అందరికీ అర్థం కావాల్సిన విషయం.

మేమంటే చులకనా ? !
ఒక్కరోజు మన ఇంటిని చీపురుతో ఊడవకుండా, తిన్న ఆహార పదార్థాలు ఎక్కడివి అక్కడ వదిలేస్తే ఇల్లంతా దుర్వాసనతో నిండిపోతుంది. అలాంటిది వందల మంది నడిచే దారి శుభ్రంగా లేకపోతే రకరకాల జబ్బులు రావడం ఖాయం. నేడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను మన దరి చేరకుండా రక్షణ కవచంలా కాపాడేది వారే. బిడ్డ ఆరోగ్యం కోసం తల్లి చేసే సపర్యల్లా వాళ్లు ఎన్నో మనకోసం చేస్తున్నారు. వారే పారిశుధ్య కార్మికులు. వాస్తవానికి వారికీ, వారి బిడ్డలకూ మనం ఎంతో విలువనివ్వాలి. కానీ సమాజం వారిపై ఎంతటి వివక్ష చూపుతుందో తెలిపే సంఘటనల గురించే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం.
హర్యానాకు చెందిన వసుంధర ఒక పారిశుధ్య కార్మికుని ముద్దులపట్టీ. జీ సరిగమప ఆడిషన్స్లో ఐదో కంటెస్టెంట్. వారు నివసించే ప్రాంతంలో అమ్మాయిలు చదువుకోవడమే పెద్ద విశేషం. అలాంటిది సంగీతం నేర్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. చిన్నప్పటి నుంచి పాటలంటే ప్రాణమైనా వసుంధరకి సంగీతం నేర్చుకునే అవకాశం లేకుండా పోయింది. పాటలు వినడం ద్వారానే నేర్చుకుంది. ఆమె పాడుకుంటూ కనిపిస్తే చాలు ఇరుగుపొరుగు ఆమెను చులకనగా మాట్లాడేవారు. 'మీ నాన్న ఒక పారిశుధ్య కార్మికుడు. అలాంటి ఆయన కూతురికి పాటలు కావాలా? నీవూ వెళ్లి వీధులు చిమ్ముకో..!' అంటూ ఎగతాళి చేసేవారు. అలాంటి వాతావరణంలోనూ తన తండ్రి ప్రతి క్షణం ఆమెకు అండగా నిలిచాడు. నిరుపేద కుటుంబం అయినా కూతురి కల తీర్చడం కోసం సరిగమప ఆడిషన్స్కు తీసుకువచ్చాడు. వసుంధర వేదికపై పాడటం మొదలుపెట్టగానే న్యాయనిర్ణేతలు ఆమె గానానికి ఫిదా అయ్యారు. న్యాయనిర్ణేతల్లో ఒకరైన విశాల్ దద్లానీ నేరుగా వేదిక మీదకు వచ్చి, ఆమె పాదాలకు నమస్కారం చేశారు. 'మన దేశం ఏ వైపు వెళుతోంది. అమ్మాయిలకు వారికిష్టమైన రంగాన్ని ఎంచుకునే స్వాతంత్య్రమూ లేదా? ఒకవైపు అమ్మాయిలు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్న ఇలాంటి సమయంలోనూ ఇటువంటి సంఘటనలు జరగడం ఎంత సిగ్గుచేటు' అంటూ వసుంధరను అభినందిస్తూ ఆవేదనతో చెప్పారు విశాల్.

మైనార్టీ అయితేనేమీ..!
ఇదే ఆడిషన్స్లో పాల్గొన్న మరో కంటెస్టెంట్ కేరళకు చెందిన యుమ్నా అజిన్. ఆమె ముస్లిం కుటుంబానికి చెందిన యువతి. మన దేశంలోని మతోన్మాద పరిస్థితుల వల్లో ఏమో ఆమె బయోగ్రఫీలో తల్లిదండ్రుల పేర్లు ఎక్కడా పేర్కొనలేదు. ఎలాంటి అభద్రతలో మైనార్టీలు ఉన్నారో అద్దంపట్టే విషయం. అయినప్పటికీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆమె ఇప్పటి వరకూ దేశంలో 700పైనే స్టేజ్ షోలు, 70కి పైగా ఇతర దేశాల్లో ప్రదర్శనలిచ్చింది 16 ఏళ్ల యువ అజిన్. పదికి పైగా షార్ట్ఫిల్మ్ల్లో నటించిన అనుభవం ఉందామెకు. పాప్, బాలీవుడ్, ఫోక్, భజన, గజ్వాల్లను ఇంగ్లీషు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో అవలీలగా పాడగలదు. ఇండియన్ ఐడల్ జూనియర్స్లో 2015, సరిగమప లిటిల్ ఛాంప్స్ 2017లోనూ పాల్గొని, ఎందరో మన్ననలను పొందింది. ప్రస్తుతం 2021 'సరిగమప'కు ఎంపికైంది. ఆమె పాడిన పాటకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారంటే.. ఎంత అద్భుతంగా పాడగలదో అర్థమవుతుంది.
అలాగే టాప్ 12లో గుజరాత్ నుంచి వ్రజ్ క్షత్రియ, కేరళ నుంచి అరవింద్ నాయర్లూ ఈ పోటీలకు ఎంపికయ్యారు.

ఈ పోటీల్లో గెలుపోటముల సంగతి పక్కన పెడితే. నిరుపేద కుటుంబాలను నుండి వచ్చి, ఎంపికవ్వడం అంటేనే గొప్ప విశేషం. అందుకే వాళ్లంతా ఈ పోటీల్లో విజేతలా కాదా అన్నది కాదు.. జీవితంలోనే విజేతలు. ఈ పోటీలు వారిని మరింత ప్రోత్సహించి, జీవితంలో ఉన్నతంగా నిలిచేలా చేయాలని ఆకాంక్షిద్దాం. ఈ మట్టిలో మాణిక్యాలను ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి.. ఇక్కడ వరకూ చేరినందుకు సాదరంగా ఆహ్వానిద్దాం.. అభినందిద్దాం.
ఎందరికో స్ఫూర్తి !

జీ సరిగమప ఆడిషన్స్లో పాల్గొన్న మరో కంటెస్టెంట్ అరుణాచల్కు చెందిన తుప్టెన్ సెరింగ్. అతను నేడు లక్షలాదిమంది యువతకు ఆదర్శం. అన్ని అవయవాలూ సరిగా ఉన్నవారే జీవితంలో తామేమీ సాధించలేమంటూ ఒక్కోసారి డీలా పడిపోతుంటారు. కానీ తుప్టెన్ ఐదేళ్ల వయసులోనే విద్యుద్ఘాతం వల్ల రెండు చేతులనూ కోల్పోయాడు. అయినా ఎక్కడా తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. తుప్టెన్ను 'ది సోలో ఫెర్పార్మర్' అని కూడా పిలుస్తారు. అతను అందరిలానే చేయగలగడం ఆశ్చర్యం కలిగించే విషయం. వంట చేయడం, రాయడం, క్రికెట్, షటిల్, వాలీబాల్లాంటి ఆటలు ఆడటం, డ్రైవింగ్ చేయడం చూసిన ఎవరైనా అతని ఆత్మవిశ్వాసానికి ఫిదా అవ్వాల్సిందే. ఇతను 2016 ఇండియన్ ఐడల్ టాప్ 12లో స్థానం దక్కించుకున్నాడు. అప్పట్లో క్రికెట్ దిగ్గజం సచిన్ 'ఇతను చాలా ప్రత్యేకమైన వ్యక్తి. జీవితంలో ఎన్నో సవాళ్లు అధిగమిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు' అంటూ ట్వీట్ చేశాడు. అంతేనా సల్మాన్ఖాన్ అతనితో కలిసి పాడిన పాటను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. తుప్టెన్ తన పాఠశాల విద్యను మంజుశ్రీ విద్యాపీఠ్ అనాథ శరణాలయం నుండి పూర్తి చేశాడు. ప్రస్తుతం ఆ స్ఫూర్తి నిండిన తుప్టెన్ 'జీ సరిగమప' పోటీలకు ఎంపికయ్యాడు.
- స్వర్ణలత నూకరాజు