స్పందనకు 152 అర్జీలు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: స్పందనలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణన్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం ప్రతి సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే స్పందన కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, డిఆర్ఓ రాజశేఖర్లతో కలసి జిల్లా నలుమూలల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. మొత్తం152 అర్జీలు రాగా, ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 101, జిల్లా పౌరసరఫరాల శాఖ 2, సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డు శాఖకు 8, హౌసింగ్ కార్పొరేషన్కు 3, సంక్షేమశాఖ 6, పోలీసు శాఖకు 5, పంచాయత్రాజ్ శాఖకు 6, ఇతరులు 21 అర్జీలు రావడం జరిగిందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల మీద తరచూ సమీక్షిస్తున్నారని, జిల్లా అధికారులు వచ్చిన అర్జీల మీద సత్వరం చర్యలు తీసుకుని పరిష్కరించాల్సిందిగా జెసి, డిఆర్ఓను జిల్లా అధికారులను ఆదేశించారు. ఈకార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.










