ప్రజాశక్తి-గుంతకల్లు రూరల్ సంక్షేమ పథకాల అమలులో మహిళలకి అగ్రస్థానం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి అన్నారు. బుధవారం నలగొండ గ్రామంలో వైఎస్సార్ ఆసరా మూడో విడత పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అన్నింటినీ 99 శాతం నెరవేర్చారన్నారు. గత ప్రభుత్వాలు ఎన్నడూ చేయలేని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారన్నారు. కరోనా మహమ్మారి లేకపోతే పరిశ్రమలు ఏర్పాటుచేసి లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉండేదన్నారు. పిల్లల చదువుకి ఎంతో శ్రద్ధ చూపుతున్న ఆయన భవిష్యత్తులో వారి అభివృద్ధికి ఎన్నో ఉద్యోగాలు సృష్టి చేయగల మహా సమర్థ నాయకుడు జగన్ అన్నారు. ఎంపీపీ వాల్మీకి మాధవి మాట్లాడుతూ టిడిపి హయాంలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి, శిథిలావస్థలో ఉన్న పాఠశాలలు, గుంతల రోడ్లు దర్శనమిచ్చేవని అన్నారు. సిఎం జగన్మోహన్రెడ్డి నాడు నేడు కింద కొత్త భవనాలు నిర్మించారన్నారు. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చారన్నారు. అనంతరం రూ.6.15 కోట్లు ఆసరా చెక్కును ఎమ్మెల్యే చేతుల మీదుగా మహిళా సంఘాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ప్రభావతి, సర్పంచి భాగ్యమ్మ, జెడ్పిటిసి కదిరప్ప, సింగిల్ విండో ఛైర్మన్, వైసిపి మండల కన్వీనర్ మోహన్, ఎంపీడీవో జాషువా, యుఆర్డి బారెన్ సాహెబ్, ఏపీఎం రామ్మూర్తి, మండల స్థాయి అధికారులు సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.










