
ప్రజాశక్తి - ముసునూరు
నాతోటి ఎంపిటిసిలు, అధికారుల సమన్వయ సహకారాలతో ముసునూరు మండలాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళతానని మండల పరిషత్ అధ్యక్షురాలు కోండా దుర్గాభవాని వెంకట్రావ్ తెలిపారు. శనివారం మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఒ జి.రాణి, వైస్ ఎంపిపి కోటగిరి రాజానాయనల ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయం, విద్య, వైద్య రంగాల అధికారులు సమన్వయంతో పనిచేసినట్లయితే మండలాభివృద్ధి బాగుంటుందన్నారు. అదేవిధంగా జలకళ ద్వారా మండలంలోని 16 గ్రామాల్లో 131 బోర్లు వేయడం జరిగిందని, విద్యుత్ శాఖాధికారులు త్వరగా ప్రతిపాదనలు రూపొందించాలని కోరారు. అలాగే లోపూడి సర్పంచి పేరం కృష్ణ, రాజానాయన మాట్లాడుతూ 2020లో ఎన్ఆర్ఈజిఎస్ నిధులు లోపూడి గ్రామానికి రూ.2 లక్షల 69వేలు, సూరేపల్లి గ్రామానికి రూ.5 లక్షలు ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసి, ఆ నిధులు మంజూరు కాలేదన్నారు. అదేవిధంగా గత సంవత్సరంలో ఇంకుడుగుంతల పనికింద రూ.84,404 లోపూడి గ్రామ సచివాలయం పరిధిలో పనిచేస్తే ఇప్పటి వరకు ఆ నిధులు కూడా మంజూరు కాలేదని ఉపాధి హామీ సిబ్బందిని కోరారు. కోర్లగుంట సోసైటీ అధ్యక్షులు మూల్పురి నాగవల్లేశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్ శాఖ స్పందించి ముసునూరు మండలం మెట్ట ప్రాంతం కావున రబీ సీజనల్ పంటలైన పుగాకు, మొక్కజొన్న, మిర్చి పంటలు రాత్రి వెళల్లో బోరు నీళ్లు పెట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి గతంలో వలే పగలే వ్యవసాయ కరెంట్ త్రీఫేజ్ ఇవ్వాలని ఆ శాఖాధికారులను కోరారు. జలకళ బోర్లు కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. వైస్ ఎంపిపి-2 పాముల గంగధరరావు మాట్లాడుతూ ప్రభుత్వ భవనాల నిర్మాణపనులు పెట్టుబడి పెట్టి చేపడితే, ఇప్పటి వరకు ఆ బిల్లులు మంజూరు కాలేదని, మండల అధికారులు స్పందించి మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు పేరం కృష్ణ, చలసాని దామెదరరావు, పిల్లి సత్యనారాయణ, రాజబోయిన శ్రీదేవి శ్రీనివాసరావు, గద్ధల సుహాసిని మోహానరావు, కాట్రేనిపాడు ఎంపిటిసి సూర్యదేవర నాగమంజుల శ్రీనివాసరావు, తహాశీల్దార్ దాసరి సుధ, ఎంపిటిసి, అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు నిధులు మంజూరు
పార్టీలకతీతంగా ముసునూరు మండలాన్ని అభివృద్ధి చేయడమే తమ ధ్యేయమని మండల వైసిపి అధ్యక్షులు మూల్పురి నాగవల్లేశ్వరరావు, వైస్ ఎంపిపి కోటగిరి రాజానాయనలు పేర్కొన్నారు. శనివారం ముసునూరు ఎంపిపి కార్యాలయం వద్ద వారు విలేఖర్లతో మాట్లాడుతూ మండలాభివృద్ధికి పార్టీలతో సంబంధం లేకుండా సేవ చేయడానికి, నిధులు మంజూరు చేయడానికి, పారిశుధ్యం, తాగు నీరు, వీధి లైట్లు మొదలైన పనులు చేయడానికి సహాయ సహకారలతో సిద్ధంగా వున్నామన్నారు. అదేవిధంగా సింహాద్రిపురం, కోర్లగుంట ఆర్అండ్బి రోడ్డుకు రూ.35 లక్షలు, ఎల్లాపురం, బలివే ఆర్అండ్బి రోడ్లకు రూ.50 లక్షలు, అక్కిరెడ్డి గూడెం రోడ్డకు రూ.35 లక్షలు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎంపిపి కోండా దుర్గాభవానీ వెంకట్రావ్, వైస్ ఎంపిపి-2 పాముల గంగధరరావు, ఎంపిటిసి చిలీ లక్ష్మి, సర్పంచి కంచర్ల వాణి, రేగుల గోపాలకృష్ణ, ఎంపిటిసి వెంకమ్మ పాల్గొన్నారు.