
ప్రజాశక్తి-అనకాపల్లి : విద్యాశాఖ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులకు మూడు నెలల వేతన బకాయి చెల్లించాలని ఎపి కాంట్రాక్టు అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ అనకాపల్లి శాఖ డిమాండ్ చేసింది. ఆదివారం అనకాపల్లి సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్.శంకరరావు, ఫెడరేషన్ జిల్లా చైర్మన్ వివి శ్రీనివాసరావు మాట్లాడుతూకాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని పాదయాత్రలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి జగన్ నెరవేర్చకపోగా, వారికి సక్రమంగా వేతనాలు చెల్లించక ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. మూడు నెలలుగా జీతాలు లేకపోతే, కుటుంబాలతో ఎలా బతకాలో చెప్పాలని డిమాండ్ చేశారు. దసరా పండగకు ఉద్యోగులను పస్తులు పెట్టడం దుర్మార్గమన్నారు. కనీస వేతనం, సమాన పనికి సమాన వేతనం ఎక్కడ కానరాలేదన్నారు. జీతాలు, పర్మినెంట్ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శివాజీ పాల్గొన్నారు.