
* ట్రిబుల్ ఐటి డైరెక్టర్ జగదీశ్వరరావు
ప్రజాశక్తి- ఎచ్చెర్ల: యువతను సమాజ సేవలో చైతన్య పరచిన జాతీయ సేవా పథకం అని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ డైరెక్టర్ ప్రొఫెసర్ పి.జగదీశ్వరరావు అన్నారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ శ్రీకాకుళం ప్రాంగణంలో జాతీయ సేవా పథకం ఆవిర్భావ దినోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గాంధీ మహాత్ముని శత జయంతి ఉత్సవాల్లో భాగంగా 50 సంవత్సరాల కిందట మన దేశంలో ప్రారంభమైన జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) యువతను సమాజ సేవలో చైతన్య పరచటంలో ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. ఒఎస్డి ప్రొఫెసర్ ఎల్.డి.సుధాకర్బాబు మాట్లాడుతూ వాలంటీర్లు ఎన్ఎస్ఎస్ అడాప్ట్ చేసుకున్న ప్రజల్లో ఆరోగ్యం-పరిశుభ్రత, స్వచ్ఛత తదితర అంశాలపై పాఠశాల పిల్లలకూ అవగాహన కల్పించాలన్నారు. పరిపాలన అధికారి ముని రామకృష్ణ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని, విద్యార్థి దశలోనే అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అకాడమిక్ డీన్ మోహన్కృష్ణ చౌదరి, ఫైనాన్స్ ఆఫీసర్ అసిరినాయుడు, ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ డాక్టర్ పి.ముకుందరావు, పిఒలు డాక్టర్ వి.సింహాచలం, డాక్టర్ బి.శ్రీధర్, డాక్టర్ ఆర్.శ్రీనివాసరావు, వెల్ఫేర్ డీన్ గేదెల రవి, డాక్టర్ జి.ఈశ్వరరావు, ఆర్.మల్లీశ్వరి పాల్గొన్నారు.