Oct 26,2023 22:58

నివాళులర్పిస్తున్న సిపిఎం నాయకులు, శ్రీహరిబాబు (ఫైల్‌, ఇన్‌సెట్‌)

ప్రజాశక్తి - చిలకలూరిపేట : పట్టణంలోని పండరిపురం 8వ లైనులో నివాసం ఉండే సిపిఎం అభిమాని, విశ్రాంత అధ్యాపకులు జంపని శ్రీహరిబాబు (72) బుధవారం రాత్రి తన నివాసంలో మృతి చెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం నిర్వహిస్తామని కుటుంబీకులు తెలిపారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రుకు చెందిన శ్రీహరిబాబు చిలకలూరిపేటలో స్థిరపడ్డారు. శ్రీహరిబాబు భౌతికకాయాన్ని గురువారం చికలూరిపేటలోని ఆయన నివాసంలో పలువురు సిపిఎం నాయకులు సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీనియర్‌ నాయకులు బి.శంకరరావు మాట్లాడుతూ శ్రీహరిబాబు కుటుంబం దాదాపు 30 ఏళ్లుగా వామపక్ష ఉద్యమంలో పని చేసిందని, పెదనందిపాడులో తేళ్ల నారాయణ విజ్ఞాన కేంద్రం నిర్మాణం, పాలపర్రులో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీహరిబాబు ఎంతో సహాయ సహకారాలు అందించారని చెప్పారు. జన విజ్ఞాన వేదికలో ప్రారంభం నుంచి పని చేశారన్నారు. శ్రీహరిబాబు పని చేసిన కళాశాలల్లో తాగునీరు, తరగతుల నిర్మాణానికీ సహకరించారని తెలిపారు. జీవితాంతం సిపిఎంకు మద్దతుదారుగా ఉన్నారన్నారు. నివాళులర్పించిన వారిలో సిపిఎం పట్టణ కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు, పెదనందిపాడు మండల కార్యదర్శి డి.రమేష్‌బాబు, నాయకులు టి.ప్రతాప్‌రెడ్డి, ఎన్‌.కాళిదాసు, కె.శ్రీనివాసరెడ్డి, ఎవి శివయ్య, డి.బుచ్చి బాబు, వివికె సురేష్‌, ఎం.రవీంద్రబాబు, పి.సుబ్బారావు, ఎం.ఉపేంద్ర, జె.రామారావు, ఆర్‌.కోటేశ్వరరావు తదితరులున్నారు. సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.రాధాకృష్ణ సంతాపం తెలిపారు. శ్రీహరిబాబు కుటుంబానికి పలువురు ప్రగాఢ సానుభూతి తెలిపారు.