
* ప్రజాశక్తి' కథనానికి స్పందన
ప్రజాశక్తి- కవిటి: 'శీతల కొండలో ఏం జరుగుతోంది' అంటూ శనివారం ప్రజాశక్తిలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. రెవెన్యూ, మైన్స్, పోలీస్ శాఖల అధికారులు సోమవారం శీతల కొండకు చేరుకుని అక్కడ జరుగుతున్న క్రషర్ పనులు పరిశీలించారు. గతంలో ఈ పనులు ఎవరు నిర్వహించారు... ప్రస్తుతం ఎవరు చేస్తున్నారు వివరాలు తెలుసుకున్నారు. సుమారు 6.54 ఎకరాల్లో జరుగుతున్న ఈ క్రషర్ పనులకు ఉన్న అనుమతులు, పరిసర ప్రాంతాలకు, కొండకు మధ్య ఉన్న దూరం పరిశీలించారు. అనంతరం కొండలో బ్లాస్టింగ్ చేసే సమయంలో మరోసారి పరిశీలించి, పరిసర ప్రాంతాలపై దాని ప్రభావం ఎంతనేది ప్రత్యక్షంగా పరిశీలించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో తహశీల్దార్ పి.శేఖర్, ఎస్ఐ కె.రాము, మైనింగ్ సిబ్బంది నాగేంద్ర, ఆర్ఐ రమణమూర్తి, విఆర్ఒలు పూడి కల్పన, దామోదర్, శివ పాల్గొన్నారు.