Nov 17,2023 21:00

ప్రజాశక్తి- యంత్రాంగం
           సిఎం జగన్‌ నూజివీడు పర్యటన సందర్భంగా ఏలూరు జిల్లాలో పలుచోట్ల సిపిఎం నాయకులను ముందస్తుగా పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. పలువురిని గృహ నిర్బంధం చేశారు. నూజివీడు మండలం గొల్లపల్లిలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ నరసింహను, ఉంగుటూరు మండలం కైకరంలో కౌలు రైతు సంఘం జిల్లా కన్వీనర్‌ కె.అప్పారావును నిడమర్రు మండలంలో భవన నిర్మాణ కార్మికసంఘం జిల్లా ప్రధానకార్యదర్శి, సిపిఎం నేత నారపల్లి రమణరావును, ఇతర కార్మిక, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు గురువారం అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేశారు. పలువురిని గృహ నిర్బంధం చేశారు.
ముందస్తు అరెస్టులు అప్రజాస్వామికం : సిపిఎం
ఏలూరు:సిఎం జగన్‌ నూజివీడు పర్యటన సందర్భంగా సిపిఎం నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం, గృహనిర్బంధానికి పాల్పడటం అప్రజాస్వామికమని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి విమర్శించారు. రాష్ట్రంలోని 175 స్థానాలూ తామే గెలుస్తామని, తమ పరిపాలన పట్ల ప్రజలకు సానుకూలత ఉందని గొప్పలు చెప్పుకునే సిఎం ఈ విధమైన చర్యలకు పాల్పడడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నిజంగా మంచి పరిపాలనే అందిస్తే ప్రతిపక్షాలకు భయ పడాల్సిన అవసరం ఈ ముఖ్యమంత్రికి లేదన్నారు. నిర్బంధాలు, అణచివేతలు, దౌర్జన్యాలతో ఎంతో కాలం ప్రజలను మభ్య పెట్టలేమని, చరిత్రలో ఇలా ప్రవర్తించిన అనేకమంది కాలగర్భంలో చరిత్ర హీనులుగా మిగిలిపోయారనే విషయాన్ని గుర్తు చేసుకో వాలని హితువుపలికారు. సిఎం తమ వద్దకు వస్తున్నారంటే తమ ఇబ్బందులను, సమస్యలను తెలియజేసి పరిష్కరించాలని కోరేందుకు ప్రజల ముందుకు వస్తారని, వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుందని తెలిపారు. సిపిఎం ఎప్పటికీ ప్రజాసమస్యలపై పోరాడుతూనే ఉంటుందని, ఈ నిర్బంధాలకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
నిడమర్రు:అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని సిఐటియు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం జగన్‌ నూజివీడు పర్యటన సందర్భంగా ముందస్తుగా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారపల్లి రమణ రావును గురువారం అర్ధరాత్రి అరెస్టు చేయడాన్ని ఖండించారు. ఉద్యమకారులను నిర్బంధించడం అప్ర జాస్వామికమని, హక్కులకు భంగం కలిగించడమేనని విమర్శించారు. సిఐటియు నాయకులు కంచ వరప్రసాద్‌, గవర సత్యనారాయణ, గోక సూరిబాబు, కోసూరి శివ, రోకల ఏసురెడ్డి, డి.పాండు, కమిలి నాని, కానూరు రాజు అక్రమ అరెస్టును ఖండించారు.
ఏలూరు అర్బన్‌ : సిఎం జగన్‌ నూజివీడు పర్యటన సందర్భంగా రైతు, కౌలురైతు సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. నూజివీడు మండలం గొల్లపల్లిలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ నరసింహను, ఉంగుటూరు మండలం కైకరంలో కౌలు రైతు సంఘం జిల్లా కన్వీనర్‌ కె.అప్పారావును ఇతర ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేయడం దారుణమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జిల్లాకు వస్తున్న ప్రతిసందర్భంలోనూ ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని, ఈ తీరును ప్రభుత్వం మార్చుకోకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అర్ధరాత్రులు పోలీసులు, ప్రజా సంఘాల, రైతు సంఘాల నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లడంతో చుట్టుపక్కల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అక్రమ అరెస్టులు చేసినంత మాత్రాన ఉద్యమాలు ఆగవని మరింత ఉధృతమవుతాయని హెచ్చరించారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని కోరారు.
టిడిపి, జనసేన నాయకుల అరెస్టు
ముసునూరు:సిఎం జగన్‌ నూజివీడు పర్యటన సందర్భంగా మండలంలోని టిడిపి నాయకులు గద్దె రఘుబాబు, రమణక్కపేట గ్రామానికి చెందిన జనసేన నాయకులు పాశం నాగబాబు, మరీదు శివరామకృష్ణ, ఎం.సునీల్‌కుమార్‌, బండారు రాజును, సిపిఎం నాయకులను ముందస్తుగా పోలీసులు ఆరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఎం పర్యటన నేపథ్యంలో వామపక్ష నాయకులను, ప్రజా సంఘాల నేతలను, ప్రతి పక్ష నేతలను ఆరెస్టు చేయడం అన్యాయమన్నారు.