
ప్రజాశక్తి - ఏలూరు
ఈనెల 17వ తేదీన సిఎం జగన్ నూజివీడు పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి దిశా నిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సిఎం పర్యటనలో చిన్నపాటి లోపాలకు కూడా తావు లేకుండా విధులు కేటాయించిన అధికారులు అప్ర మత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో జెసి లావణ్యవేణి, డిఆర్ఒ వెంకటేశ్వర్లు, ఆర్డిఒ ఖాజావలి, డిఆర్డిఎ పీడీ ఆర్.విజయరాజు, డ్వామా పీడీ రాము, ఉప రవాణా కమిషనరు ఎస్.శాంతకుమారి పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి పర్యటన సాగేదిలా..
17వ తేదీ ఉదయం 9.55 గంటలకు తాడేపల్లి నుండి హెలీకాప్టర్లో సిఎం బయలుదేరి 10.25 గంటలకు నూజివీడులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకుంటారు. 10.25 గంటల నుంచి 10.35 వరకూ ప్రజాప్రతినిధులతో ముచ్చటిస్తారు. 10.55 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను సందర్శించి లబ్ధిదారులతో ఫొటోసెషన్లో పాల్గొంటారు. అనంతరం ఫ్రీ హోల్డింగ్ ఆఫ్ అసైన్మెంట్ ల్యాండ్ పట్టాలను, ఇతర రెవెన్యూ అంశాలకు సంబంధించి లబ్ధిదారులకు అందజేస్తారు. మధ్యాహ్నం 12.35 గంటలకు సభా ప్రాంగణం నుండి బయలుదేరి 12.50 గంటలకు హెలీప్యాడ్కు చేరుకుంటారు. 12.50 గంటల నుండి మధ్యాహ్నం 1.50 గంటల వరకు స్థానిక నాయకులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 1.55 గంటలకు హెలీప్యాడ్ నుండి బయలుదేరి తాడేపల్లి వెళతారు.
నూజివీడు టౌన్:ఈనెల 17వ తేదీన నూజివీడులో సిఎం జగన్ పర్యటనకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణి అధికారులను ఆదేశించారు. సిఎం పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను ఎస్పి డి.మేరీప్రశాంతి, ఎంఎల్ఎ మేకా వెంకట ప్రతాప్ అప్పారావుతో కలిసి జెసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా హెలీపాడ్, సభాస్థలి వద్ద, ప్రజలకోసం చేసిన ఏర్పాట్లను జెసి పరిశీలించారు. సభాస్థలి వద్ద అధికారులతో సిఎం పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ సభకు ప్రజలు పెద్దఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున, ప్రజలకు అసౌకర్యం కలగకుండా, తొక్కిసలాట జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు, విఐపి, ప్రజల వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎస్పి మాట్లాడుతూ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలని, ముఖ్యమైన కూడళ్లఓ మరింత భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఎంఎల్ఎ మేకా వెంకట ప్రతాప్అప్పారావు మాట్లాడుతూ సభకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరవుతారని, వారికి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు. నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్శరాజేంద్రన్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ శ్రీపూజ, జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాధ్, ఆర్డిఒ ఎన్ఎస్కె.ఖాజావలి, ఆర్అండ్బి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇల జాన్ మోషే, సత్యనారాయణ, వ్యవసాయ శాఖ జెడి వై.రామకృష్ణ, డిఎస్పి అశోక్ కుమార్ గౌడ్, మునిసిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, వైస్ఛైౖర్మన్ పగడాల సత్యనారాయణ అధికారులు ఉన్నారు.