ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా సైనిక సంక్షేమ శాఖ స్టేట్ డైరెక్టర్ వి.వెంకట రెడ్డి ఆదివారం తిరుపతి, చిత్తూరులో మాజీ సైనికులతో సమావేశం ఏర్పాటు చేశారు. తిరుపతిలో అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి, అనంతరం ఆర్మీ కాంటీన్ సందర్శించి వారికి కొన్ని సూచనలు చేశారు. చిత్తూరు జిల్లా సైనిక సంక్షేమ అధికారి కార్యాలయంలో ఆఫీసు రికార్డులను పరిశీలించి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. తరువాత రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్న 93 సంవత్సరాల మాజీ సైనికుడు కణ్ణన్, వారి భార్యను చిత్తూరు టౌన్లో నివాసముంటున్న వారి ఇంటికి వెళ్లి శాలువ, నూతన వస్త్రాలతో సన్మానించారు. తర్వాత చిత్తూరు టౌన్ ప్రశాంతి నగర్ లో నివాసముంటున్న మాజీ సైనికుడు జయరాం కుమారుడు సంతోష్ వంద శాతం వికలాంగుడైనందున అతని నివాసంలో కలిసి నూతన వస్త్రాలు బహుకరించారు. తర్వాత చిత్తూరుటౌన్ వినాయక పురంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి కార్యాలయం (సైనిక భవన్) నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని మాజీ సైనికులు, జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఆర్.విజయ శంకర్ రెడ్డితో కలిసి పరిశీలించారు.










