Oct 18,2020 09:19

తెలుగునాట సాంస్కృతిక రంగం ... కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావంతో చైతన్య పుంతలు తొక్కింది. ప్రజాకళలు ప్రవర్ధమానమయ్యాయి. జానపద కళల్లో పురాణ కథల స్థానే ప్రజా సమస్యలు చోటు సంపాదించు కున్నాయి. ప్రజలకు అర్థమయ్యే భాషలో వీరోచితంగా సాగే బుర్రకథ ఆంధ్ర ప్రజా నాట్యమండలి అద్భుత ప్రయోగమే !  ఊరూరా జనం ఉర్రూతలూగిపోయేలా మార్మోగింది. 'మా భూమి' వంటి నాటకాలు ప్రజల్లో అంతర్లీనంగా ఉన్న పోరాట శక్తిని ప్రేరేపించాయి. ఎక్కడో భూస్వాముల సన్నిధిలోనే ఆడబడే నాటకాలు కొత్త కొత్త ఇతివృత్తాలతో సామాన్యుల వాకిట్లోనే ప్రదర్శితమయ్యాయి. కళ కళ కోసం కాదు; ప్రజల కోసం అన్న ప్రజా సూక్తి పుట్టిందీ, ప్రాచుర్యం పొందిందీ అప్పుడే ! నాటకాల్లోకి సామాన్యులే కథానాయకులుగా ప్రవేశించారు. మట్టిలో మాణిక్యాల్లా వందలాదిమంది కళాకారులుగా, రచయితలుగా, గాయకులుగా, నటులుగా పుట్టుకొచ్చారు. పద్యాలూ రాగాలూ స్థానే అర్థమయ్యే జనభాష నాటక భాషగా మారింది. జానపదాల్లోకి బాణీలు తీసుకొని... ప్రజాసాహిత్యాన్ని జోడించి .. వాటిని పాటలు కట్టి ప్రజారంజకం చేశారు. మన సాధారణ వీధులనే నాటక ప్రదర్శన వేదికలుగా మార్చటం, తక్కువ ఖర్చుతో ప్రదర్శనలు ఇవ్వడం తెలుగు నాట కమ్యూనిస్టులు సాధించిన మరొక గొప్ప మార్పు. 1950 తరువాత సినిమాల్లోకి ప్రవేశించిన ప్రజా నాట్యమండలి కళాకారులు అక్కడా అభ్యుదయాన్ని చాటారు. సాంప్రదాయ కళల్లో సైతం జనాభ్యుదయ ఇతివృత్తాలకు తావిచ్చేలా గణనీయమైన ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాన్ని చూపించారు.
అనేక జనకవులు పుట్టుకొచ్చారు. సామాన్యుల ఇతివృత్తాలతో కళాసృజన చేసిన పూర్వకవులు, కళాకారులను సైతం ప్రజానాట్యమండలి వెలికితీసి, విస్తృత ప్రచారం కల్పించింది. కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావంతో చోటుచేసుకున్న సాంస్కృతిక రంగ మార్పులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దేవుళ్లను, ప్రభువులను మాత్రమే కీర్తించే ఇతివృత్తాల స్థానే... ప్రజల జన జీవ గాథలను ప్రతిష్టించిన ఆ చైతన్యం ఎప్పటికీ అనుసరణీయమే !