
* 5న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహణ
* జిల్లాలో 26,970 ఇళ్లు ప్రారంభం
* జలుమూరులో ప్రారంభించనున్న మంత్రి ధర్మాన
* యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 5న సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. సామూహిక గృహ ప్రవేశాలు చేపట్టాలని గతంలో అనేకసార్లు తేదీలు ప్రకటించినప్పటికీ రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వచ్చాయి. ఈ సారి ఎలాగైనా కార్యక్రమం చేసి తీరాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చివరి దశకు వచ్చాయి. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోటలో ఆ రోజున ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. అదేరోజున రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు జలుమూరు మండలం లింగాలవలస లేఅవుట్లోని గృహాలను ప్రారంభించనున్నారు. తొలి రోజు ప్రారంభించనున్న గృహాలకు విద్యుత్, తాగునీరు సౌకర్యం కల్పనకు సంబంధించి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి: జిల్లాలో నవరతాలు పేదలందరికీ ఇళ్లు (ఎన్పిఐ) పథకంలో భాగంగా ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేసింది. వీటిని వివిధ దశల్లో చేపడుతూ 2024 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. వీటిలో తొలుత ఈ నెల ఐదో 26,970 మందితో గృహప్రవేశాలు ప్రారంభించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల ఇళ్లు పూర్తయినట్లు లెక్కలు చెప్తున్నా లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పన అంతమాత్రంగానే ఉంది. సొంత స్థలాల్లో నిర్మించుకుంటున్న ఇళ్లకు తాగునీరు, విద్యుత్ సౌకర్యం కొంత వరకు బాగానే కల్పించినా... జగనన్న లేఅవుట్లలో మాత్రం తీవ్ర వెనుకబాటు కనిపిస్తోంది. జిల్లాకు నిర్ధేశించిన 26,970 గాను ఇప్పటివరకు 24,773 ఇళ్లకు తాగునీరందించినట్లు అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి 25,182 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. నీటి సరఫరాకు సంబంధించి మూడు మండలాల్లో మాత్రమే పూర్తి స్థాయిలో తాగునీటి కనెక్షన్లు ఇచ్చారు. గృహప్రవేశాలకు సిద్ధమవుతున్న 26,970 గాను, ఇంకా 1788 ఇళ్లకు విద్యుత్ సరఫరా అందించలేదు.
అరొకొరగానే మౌలిక వసతులు
శ్రీకాకుళం అర్బన్ ప్రాంతంలో 875 ఇళ్లను ప్రారంభించాల్సి ఉండగా, ఇప్పటివరకు 510 ఇళ్లకు తాగునీటి సౌకర్యం, 324 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వలేదు. సోంపేటలో 945 ఇళ్లను ప్రారంభోత్స వానికి సిద్ధం చేస్తుండగా, వాటిలో 363 ఇళ్లకు తాగునీరు, 188 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వలేదు. ఇచ్ఛాపురం మండలంలో 632 ఇళ్లలో ప్రవేశాలు జరపాలని నిర్ణయించగా, 181 ఇళ్లకు తాగునీరు, 177 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వలేదు. జలుమూరు లో 1104 ఇళ్లను ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తుండగా, వాటిలో 145 ఇళ్లకు తాగునీరు, 60 ఇళ్లకు విద్యుత్ సరఫరా సమకూర్చలేదు. ఇచ్ఛాపురం అర్బన్లో 962 ఇళ్లకు గాను, 125 ఇళ్లకు తాగునీటి కనెక్షన్లు, 128 ఇళ్లకు విద్యుత్ సౌకర్యం అందించ లేదు. పలాస-కాశీబుగ్గలో 795 ఇళ్లను ప్రవేశాలకు సిద్ధం చేస్తుండగా, 209 గృహాలకు తాగునీరు, 24 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు సమకూర్చలేదు. ఆమదాలవ లస అర్బన్లో పరిస్థితి కొంత బాగానే ఉంది. 761 ఇళ్లలో ప్రవేశాలు చేయాలని నిర్ణయించగా, 8 ఇళ్లకు తాగునీరు, పది ఇళ్లకు విద్యుత్ సరఫరా చేయలేదు.
ఐదు పర్యాయాలు వాయిదా
సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం ఇప్పటివరకు ఐదు పర్యాయాలు వాయిదా పడ్డాయి. 2022లో విజయదశమి రోజున నిర్వహిస్తామని ప్రభుత్వం తొలుత ప్రకటించింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజైన డిసెంబరు 21 చేపడతామని నిర్ణయించింది. గృహ నిర్మాణాల లక్ష్యం కనీసం సగం కూడా పూర్తికాకపోవడంతో వాయిదా వేసింది. ఈ ఏడాది మార్చి 22న ఉగాది సందర్భంగా అందరితో గృహ ప్రవేశాలు జరుపుతా యమని తెలిపింది. ఆగస్టు 30న ప్రారంభించేందుకు తేదీ ఇచ్చారు. అనివార్య కారణాల వల్ల ఆ తేదీ వాయిదా పడింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో జిల్లాల్లో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం... అందులో భాగంగానే సామూహిక ఇళ్లనూ ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
డిసెంబరు నాటికి మరో 18,700 ఇళ్లు
వచ్చే ఎడాది ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరో 18,700 ఇళ్లను సామూహిక గృహ ప్రవేశాలు సిద్ధం చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఇందుకోసం జిల్లాల వారిగా లక్ష్యాలను నిర్ధేశించింది. ఈ ఎడాది డిసెంబరు నాటికి పూర్తి చేయాలని సూచించినట్లు తెలిసింది.