
కొత్తూరు ఆనకట్ట నిర్వహణలో నిర్లక్ష్యంపై ఆవేదన
ప్రజాశక్తి-రాంబిల్లి :మండలంలోని కొత్తూరు గ్రామం వద్ద ఉన్న శారదానదిలో ఉన్న ఆనకట్ట కొట్టుకుపోయి, సాగునీరు వృథాగా సముద్రం పాలౌతున్న పాలకులు, అధికారులకు పట్టకపోవడం దుర్మార్గమని ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్సి ఎం.అప్పలరాజు, సిపియం రాంబిల్లి మండల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం కొత్తూరు వద్దనున్న కొట్టుకుపోయిన ఆనకట్టను పరిశీలించారు. ఈసందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ, ఐదేళ్ల క్రితం వరదలు కారణంగా కొత్తూరు గ్రామం వద్ద ఉన్న ఏడు మూళ్ళికట్టు కొట్టుకుపోవడంతో సుమారుగా రెండు వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.
ఎన్నికలు సమయంలో పాలక పార్టీల నేతలు ఆనకట్టలు పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తామని, పెదకలవలాపల్లి నుంచి రజాల బ్రిడ్జి నిర్మాణం చేస్తామని, మూలజంప గ్రామం వద్ద కాజ్వే నిర్మిస్తామని హామీలు ఇచ్చి, ఎన్నికలు అయ్యాక మర్చిపోయారని విమర్శింంచారు. ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు. జిల్లా ఉన్నతాధికారులు రైతాంగం, ఈ ప్రాంత ప్రజలు, రైతుల సమస్యలపై దృష్టిపెట్టి పరిష్కార చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు. జి దేముడునాయుడు, చందక రామకృష్ణ, సిహెచ్.శివాజీ, వై. రాము, ఎన్. నారాయణరావు, చినకలవలపల్లి సర్పంచ్ శ్రీనువాసరావు, ఎం. శ్రీనివాస్ పాల్గొన్నారు.