
ప్రజాశక్తి-పల్నాడు : వర్షాభావ పరిస్థితులు దష్ట్యా నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నిల్వ వున్న 22 టీఎంసీల నీటిని త్రాగునీటి అవసరాలకు వినియోగించుకోవాల్సి ఉంటుందని పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్పందన హాల్లో ప్రాధాన్యత రంగాల శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ త్రాగునీటి అవసరాల కోసం ప్రతి 3 నెలలకు ఒకసారి 5 టీఎంసీల నీటిని విడుదల చేస్తారన్నారు. ఈ నీటిని సాగుకు వినియోగించరాదని రైతులుకు తెలియజెప్పాలన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆయికట్టు కింద ఉన్న రైతులకు అవగాహన కల్పించి విడుదల చేసిన నీటిని సాగునీటికి వినియోగించకుండా చూడాలని ఆదేశించారు. రైతులలో ప్రత్యామ్నాయ పంటలపై మొగ్గుచూపు విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఖరీఫ్, రబీ సీజన్లలో పండిస్తున్న పంటలు వివరాలు సేకరించారు. జిల్లాలో పనిచేయని 27 ఎత్తిపోతల పథకాలను రైతుల 20 శాతం భాగస్యమ్యం తో మరమ్మతులు చేపట్టే విధంగా ప్రతిపాదన సిద్ధం చేసి ప్రభుత్వాన్ని పంపించాలని చెప్పారు. నాదెండ్ల, చిలకలూరిపేట, యడ్లపాడు, దాచేపల్లి, బెల్లంకొండ, క్రోసూరు, పెదకూరపాడు సత్తెనపల్లి, రాజుపాలెం, వినుకొండ, ఈపూరు మండలాలు కరువు రహిత మండలాలకు ప్రభుత్వం గుర్తించిందని మిగిలిన 17 మండలాలు కరువు పీడిత మండలాలుగా ప్రభుత్వం సూచించిందని తెలిపారు. ప్రతి వ్యవసాయ అధికారి ఒక ఎకరాను దత్తత తీసుకొని నీటి ఎద్దడి నివారణ పంటలపై అవగాహన యోగాత్మకంగా పంటలు పండించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. త్రాగునీటి అవసరాలకై అవసరమైన చోట ట్యాంకర్లతో నీటి సరఫరా కోసం ప్రతిపాదన సిద్దం చేసి ముందస్తుగానే ప్రభుత్వానికి పంపించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఉద్యాన వన పంటలకు సంబంధించి పంటల సంరక్షణ కోసమని తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళి, ఉద్యానవన శాఖ అధికారి బెన్ని, నాగార్జునసాగర్ ప్రాజెక్టు సూపెన్నింటి ఇంజనీర్ వరలక్ష్మి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ సురేష్, ఎంఐపి అధికారి ఆంజనేయులు పాల్గొన్నారు.