ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ మహిళలు రుతుక్రమ సమయంలో జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యకరమైన జీవనం సాగించవచ్చని ప్రభుత్వాసుపత్రి గైనకాలజిస్టు డాక్టర్ పుష్పలత సూచించారు. రుతుక్రమ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మెప్మా ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో డిప్యూటీ కమిషనర్ సావిత్రి అధ్యక్షతన మహిళా సంఘాలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గైనకాలజిస్టు మాట్లాడుతూ రుతుక్రమం అనేది శరీరంలో జరిగే ఒక సాధారణ ప్రక్రియ అన్నారు. ఇందుకు మహిళలు సిగ్గుపడాల్సిన అవసరంగానీ, అపరాధ భావంతోగానీ ఉండాల్సిన అవసరం లేదన్నారు. అయితే శరీరం పట్ల జాగ్రత్త వహించాలన్నారు. దేహాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనం సాగించవచ్చన్నారు. ముఖ్యంగా మహిళలు న్యాప్కిన్ ప్యాడ్లను వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రమణారెడ్డి, డిప్యూటీ కమిషనర్ సావిత్రి, టౌన్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాస్రెడ్డి, కమ్యూనిటీ ఆర్గనైజర్లు భవాని, భువనేశ్వరి, సుగుణ, పల్లవి, శిరీషా, వేణుగోపాల్, నారాయణస్వామి, సత్యమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో గైనకాలజిస్టు పుష్పలత










