ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ రూ.1.70 కోట్లతో నగరంలో తాగునీటి ట్యాంకులకు నీటి సరఫరా అయ్యే పైప్లైన్ల లీకేజీ పనులు చేసి శాశ్వత పరిష్కారం చూపుతున్నట్లు మేయర్ మహమ్మద్ వసీం తెలిపారు. నగరంలోని 32వ డివిజన్ పరిధిలో పాత మైల్డ్ స్టీల్ (ఎమ్ఎస్) పైప్లైన్ స్థానంలో కొత్తగా డిఐ పైపులను మార్చుతున్న పనులను మేయర్ మహమ్మద్ వసీం గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో తాగునీరు అందించే ట్యాంకులు వద్ద తరచూ లీకేజీలు అవుతుండడంతో నీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉండేదన్నారు. సమస్య శాశ్వత పరిష్కారం కోసం 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ.1.70 కోట్లు వెచ్చించి ఓవర్హెడ్ ట్యాంకులకు నీటి సరఫరా అయ్యే పైప్లైన్లను మారుస్తున్నట్లు తెలిపారు. అలాగే నగరంలోని జార్జ్పేట, రామ్నగర్ ట్యాంకు, ఆదర్శనగర్ ట్యాంకు, ఐటిఐ ట్యాంకు, ఎంజి కాలనీ ట్యాంక్, రెండో రోడ్డు ట్యాంకు, లక్ష్మీనగర్ ట్యాంకు, అరవింద్ నగర్ ట్యాంకు, విద్యుత్నగర్ ట్యాంకుల వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న పైపులైను దాదాపు 30 నుంచి 40ఏళ్ల పాటు ఏ విధమైన లీకేజీలు ఉండవన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కమల్భూషణ్, అనిల్కుమార్రెడ్డి, సంపంగి రామాంజనేయులు, ఎస్ఇ సతీష్, డిఇ నరసింహులు, ఎఇ సాయినాథ్ బాబు, వైసీపీ నాయకులు ఖాజా, రియాజ్, కాకర్ల శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
పైప్లైన్ పనులను పరిశీలిస్తున్న మేయర్ వసీం










