అనంతపురం కలెక్టరేట్ : సేవాఘడ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు రంజిత్ నాయక్ ఆశయాలు కొనసాగిస్తామని సేవాఘడ్ ట్రస్ట్ అధ్యక్షులు కొర్రా జగన్నాథరావు పేర్కొన్నారు. ఆదివారం గుత్తి మండలం సేవాఘడ్లో రంజిత్ నాయక్ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి సేవాఘడ్ ట్రస్ అధ్యక్షులు జగన్నాథరావు, ఉపాధ్యక్షులు ఎస్కె.కేశవనాయక్, ప్రధాన కార్యదర్శి అశ్వర్థనాయక్, కోశాధికారి పిఎల్.రవీంద్ర నాయక్, ఎఐబిఎస్ఎస్ ఆలిండియా ప్రధాన కార్యదర్శి శంకర్జాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ హరిలాల్ నాయక్, కర్నాటక ఎమ్మెల్సీ జలజాబాయి, మాజీ ఎమ్మెల్యే రాథోడ్, తెలంగాణ సబావట్ రాజు నాయక్, గిరిజన బంజారా సమాఖ్య జాతీయ అధ్యక్షులు ఎస్కె.మహేష్ బంజారా తదితరులు మాజరై రంజిత్ నాయక్ విగ్రహానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంజారాల అభ్యున్నతికి, చైతన్యానికి, సామాజిక సమానత్వానికి రంజిత్ నాయక్ చేసిన సేవలు ఆదర్శనీయం అన్నారు. బంజారాలను ఏకతాటిపై తెచ్చిన మహోన్నతమైన వ్యక్తి అన్నారు. వారి ఆశయాలను కొనసాగించడమే మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐబిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటరమణ నాయక్, ప్రధాన కార్యదర్శి చక్రే నాయక్, సాంస్కృతిక విభాగం కార్యదర్శి ఎస్కె.రామచంద్ర నాయక్, రాష్ట్ర నాయకులు రంగ్లా నాయక్, బాలు నాయక్, అన్ని జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.










