Dec 13,2022 22:05

వీడియో కాన్పెరెన్స్‌లో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు

రీసర్వే పనులు వేగవంతం చేయాలి
4 గ్రామాల్లో సర్వేరాళ్ళు పూర్తి : జెసి
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:

రీసర్వే పనులు వేగవంతం చేయాలని, వివిధ దశలలో జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని, క్లరికల్‌ మాడ్యూల్‌ తర్వాత చనిపోయిన వారికి చేయాల్సిన మ్యుటేషన్‌ పనులను వేగవంతం చేయాలని జాయింట్‌కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ అన్నారు. మంగళవారం సాయంత్రం తహశీల్దార్లు, సర్వేసిబ్బంది, గ్రామ సర్వేయర్లుతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ మొదటివిడతలో రీసర్వేకి సంబంధించి 135గ్రామాలకు 13నోటిఫికేషన్‌ విడుదల చేశారని, మరో 55 గ్రామాల్లో గ్రౌండ్‌ ట్రూథింగ్‌ నిర్వహిస్తున్నారని అందులో ప్రధానంగా వి.కోట, చౌడేపల్లి, బైరెడ్డిపల్లిలలో ఎక్కువగా ఉన్నాయని వేగంగా చేయాలని, నిర్ణయించిన గడువుకాలం దగ్గరలో వుందన్నారు. మరణించిన వ్యక్తులకు సంబంధించిన మ్యుటేషన్‌ పనులు 2467 దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. రీసర్వే డిటిలు ఈ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. 22ఎ లేయర్‌కు సంబంధించి ఈ శనివారం లోపున పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌డిసి ఫర్వీన్‌, సర్వేసిబ్బంది పాల్గొన్నారు.