టీటీడీ కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన వైవి సుబ్బారెడ్డి
ప్రజాశక్తి - తిరుపతి సిటి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు రాబోయే రెండేళ్ళలో తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన, ఎస్సీ, బిసి ప్రాంతాల్లో వెయ్యి ఆలయాలు నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. స్థానిక అప్పలాయ గుంటలో రూ .3 కోట్ల 40 లక్షలతో నిర్మించిన టీటీడీ కళ్యాణ మండపాన్ని ఎమ్మెల్యే రోజాతో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆర్.కె. రోజా వినతి మేరకు అప్పలాయగుంటలో రూ .3 కోట్ల 40 లక్షలతో మూడు అంతస్తుల్లో కల్యాణ మండపం నిర్మించామన్నారు. సకల సదుపాయాలతో, తక్కువ అద్దెకు 700 మంది ఆహ్వానితులతో ఇక్కడ పెళ్ళి చేసుకోవచ్చన్నారు. టీటీడీ కళ్యాణమండపాల్లో పెళ్లి చేసుకుంటే వధూవరులకు స్వామివారి ఆశీస్సులు లభించినట్లేనన్నారు. ఈ కార్యక్రమంలో జెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, డిప్యూటీ ఈవో కస్తూరి బాయి. ఎస్.ఈలు వెంకటేశ్వర్లు, సత్యనారాయణ. అదనపు సివిఎస్వో శివకుమార్ రెడ్డి, ఈఈ నరసింహమూర్తి , విజిఓ మనోహర్, మండల పరిషత్ అధ్యక్ష్యురాలు విజయలక్ష్మి , సర్పంచ్ శేషాద్రిరెడ్డి పాల్గొన్నారు .










