
ప్రజాశక్తి-కొత్తకోట:రావికమతం మండలం కొత్తకోటలో గత నాలుగు రోజులుగా ప్రజా పంపిణి రేషన్ బియ్యం ప్రజలకు అందడం లేదు. బియ్యం పంపిణికి సంబందించిన యంత్రం సాంకేతిక లోపంతో తరుచూ మోరాయిస్తూ ఉండడంతో పాటు సిగల్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో లబ్ధిదారులకు బియ్యం పంపిణి సాగడం లేదు. గ్రామంలో సుమారు ఎనిమిది రేషన్ సరఫరా డిపోలు ఉండగా సుమారు 8 వేల రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారు. ప్రతి నెలా ఒకటి నుంచి 15 వ తేదీ వరకూ సరఫరా చేయాల్సి ఉంది. గ్రామంలో ఇంత వరకూ కనీసం 30 శాతం మందికి కూడా సరుకులు సరఫరా కాలేదు. సరుకులు పంపిణికి రెండు వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో వాహనానికి నాలుగు డిపోల సరుకులు పంపిణి చేస్తారు. ప్రస్తుతం డిపో నెంబర్ 7లో బియ్యం పంపిణీ చేపట్టారు. ఈ డిపో పరిధిలో ఎస్సి కాలనీ, అరందతి కాలనీ లలో లబ్ధిదారులు ఉన్నారు. వీరికి సరుకులు సరఫరా కాక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మండల స్థాయి అధికారులకు తెలిపినా పట్టించు కోలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో రేషన్ సరుకులు కోసం లబ్ధిదారులు డిపోల పడి గాపులు కాస్తున్నారు. ఇప్పటికైనా సంబందించిన అధికారులు చొరవ చూపి సరుకుల పంపిణికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు..