Oct 04,2023 21:32

ఫొటో : మాట్లాడుతున్న రెడ్‌క్రాస్‌ చైర్మన్‌, ఎంఎల్‌సి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి

రెడ్‌క్రాస్‌లో మెడికల్‌ క్యాంపు
ప్రజాశక్తి-నెల్లూరు : నెల్లూరు జిల్లా రెడ్‌క్రాస్‌ కార్యాలయంలో రెడ్‌క్రాస్‌ చైర్మన్‌, ఎంఎల్‌సి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి ఆద్వర్యంలో బుధవారం తలసేమియా పిల్లలకు మెడికల్‌ క్యాంప్‌ నిర్వహించారు. ముందుగా వైద్య బృందం తలసేమియా పిల్లలకు వ్యాక్సినేషన్‌, 2డి ఎకో, గుండె పరీక్షలు, బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కోసం హెచ్‌ఎల్‌ఎ పరీక్షలను నిర్వహించి మందులు అందజేశారు. రెడ్‌క్రాస్‌ తలసేమియా క్లినిక్‌ ద్వారా చిన్నారులకు అందిస్తున్న వైద్య సేవలను వైద్యులు వివరించారు. తలసేమియా పిల్లలకు కోసం ఎంతో సమయాన్ని వెచ్చించి వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు సీత, హరిత, రమ్య, భార్గవి, యశోవర్ధన్‌లను అభినందించారు.
ఈ సందర్భంగా రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ రెడ్‌క్రాస్‌లో ప్రతినెలా 100మంది తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు రక్తం అందించడమే కాకుండా ఉచితంగా మందులు, భోజన వసతి కల్పిస్తున్నామని తెలిపారు. తలసేమియా వ్యాధి జన్యుపరంగా వచ్చే వ్యాధిని బోన్‌ మ్యారో ట్రాన్స్‌ ప్లాంటేషన్‌ చికిత్స ద్వారా దీన్ని పూర్తిగా నయం చేసుకోవచ్చని తెలిపారు. బోన్‌ మ్యారో ట్రాన్స్‌ ప్లాంటేషన్‌కు దాదాపుగా రూ.25 లక్షల ఖర్చు అవుతుందన్నారు. ఇటీవల రెడ్‌క్రాస్‌ డోనార్స్‌ సహకారంతో ఏడు మంది పిల్లలకు బోన్‌ మ్యారో ట్రాన్స్‌ ప్లాంటేషన్‌ చికిత్స అందించి వారిని పూర్తి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. త్వరలో మిగిలిన వారికి కూడా బోన్‌ మ్యారో ట్రాన్స్‌ ప్లాంటేషన్‌ చికిత్స చేయించేందుకు రెడ్‌క్రాస్‌ ప్రయత్నం చేస్తుందని తెలిపారు.