
ప్రజాశక్తి- బుచ్చయ్యపేట : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చోడవరం నియోజకవర్గంలోని నాలుగు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జి బత్తుల తాతయ్యబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని రాజాం, ఆర్.శివరాంపురం గ్రామాల్లో ఎండిపోయిన వరి పంటలను టిడిపి నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ గ్రామాల రైతులు తమ బాధను తెలియజేశారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని, పంట ఎండిపోవడంతో తీవ్రంగా నష్టతున్నాయని వాపోయారు. అనంతరం తాతయ్యబాబు మాట్లాడుతూ ఒక్కో ఎకరాకు వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంట సాగు చేశారని, వర్షభావ పరిస్థితుల వల్ల పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు గోకవాడ కోటేశ్వరరావు, నాయకులు కోరుకొండ రవికుమార్, దేవర తాతాజీ, దొడ్డి కిషోర్, మరిసా సతీష్, గొన్నాబత్తుల శ్రీనివాసరావు, సిరిగిరిశెట్టి శ్రీరామ్మూర్తి, నర్సింగరావు, నమ్మి రాజు, ఎంపీటీసీ కంచిపాటి శ్రీనివాసరావు, రైతులు పాల్గొన్నారు.