రైతులకు ఎరువులు పంపిణీ
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని డిసిపల్లి పొగాకు బోర్డులో 2023-24 పంటకాలానికి ఎరువుల కోసం ఇండెంట్ ఇచ్చిన రైతులకు డిసిఎంసి నెల్లూరు ద్వారా కాఫ్ కమిటీ ఆధ్వర్యంలో వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ ఎరువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుండి కాఫ్ కమిటీ ద్వారా పొగాకు రైతులకు ఎరువులు సరఫరా చేయడం జరుగుతుందని, ఎరువులు బయట మార్కెట్ కన్నా తక్కువ ధరలకు సరైన సమయానికి ఎరువులను అందిస్తున్నామన్నారు. పొగాకు పంటకు సిటీ ఆర్ఐ సిఫారసు ప్రకారం ఒక బ్యారెన్కు అమ్మెనియం సల్ఫేట్ 11 బస్తాలు, డిఎపి 4 బస్తాలు, సల్ఫేట్ ఆఫ్ పొటాష్ 7 బస్తాలు సరఫరా చేశామన్నారు. రైతులు పొగాకును పొగాకు బోర్డు అనుమతి ఇచ్చిన మేరకే పండించాలని తెలిపారు. పొగాకు పంట ఎక్కువైతే డిమాండ్ తగ్గి సరైన ధరలు లేకపోవడం వల్ల నష్టాలు వచ్చే అవకాశం ఉందన్నారు. రైతులు విస్తీర్ణం తగ్గించి దిగుబడి పెంచాలని, అలాగే మంచి నాణ్యత గల పొగాకు పండించాలని సూచించారు. కార్యక్రమంలో కాఫ్ కమిటీ సభ్యులు ఆరికట్ల జనార్ధన్, డిసిఎంఎస్ అధికారి సుధాకర్, పొగాకు బోర్డ్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.










