Sep 04,2022 22:17

రైతు మృతిపై విచారణాధికారిగా డిఆర్‌ఒ
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:

పెనుమూరు మండలం, తిమ్మరాజు కండ్రిగ భూవివాదానికి సంబంధించి విచారణ అధికారిగా డిఆర్‌ఒ రాజశేఖర్‌ను నియమిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం. హరినారాయణన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్‌ కోర్టులో, జిల్లా న్యాయసేవ అథారిటీ చిత్తూరు వారి వద్ద వీరు వేసిన వ్యాజ్యములు పెండింగ్‌లో ఉన్నాయని డిఆర్‌ఓ విచారణ నివేదిక ఆధారంగా బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని కలెక్టర్‌ తెలిపారు.
రైతు మృతి దురదృష్టకర సంఘటన : డిఆర్‌ఒ
ఈనెల 3వ తేదీన పెనుమూరు తహశీల్దార్‌ కార్యాలయంలో జరిగిన సంఘటన దురదష్టకరమని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌.రాజశేఖర్‌ పేర్కొన్నారు. పెనుమూరు మండలం తిమ్మరాజు కండ్రిగ గ్రామానికి చెందిన పి.రాజారత్నం మతికి సంబంధించి విచారణ అధికారిగా నియమితులైన డిఆర్‌ఓ ఆదివారం పెనుమూరు మండల తహశీల్దార్‌ కార్యాలయానికి చేరుకొని చిత్తూరు ఆర్‌డిఓ రేణుక, డిఎస్‌పి సుధాకర్‌రెడ్డి, తహసీల్దార్‌ రమణిలతో కలసి బాధిత కుటుంబంతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని, ఈ సంఘటన దురదష్ట కరమన్నారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే కలెక్టర్‌ స్పందించి బాధిత కుటుంబంతో మాట్లాడడం జరిగిందన్నారు. అంతేకాకుండా వారు కోరుతున్నట్లు భూమికి సంబంధించి అది అటవీ భూమిని 1974లో ఏక్‌ సాల్‌ పర్మిషన్‌ ఇవ్వడం జరిగిందని, ఇతనికి గతంలో 1984 తాతిరెడ్డిపల్లి రెవెన్యూ గ్రామంలో 4 ఎకరాల 57సెంట్లు భూమిని ఇచ్చి ఉన్నారని తెలిపారు. ఆ భూమి మీద లోను తీసుకొని తిరిగి చెల్లించక పోవడంతో వేలం వేయడం జరిగిందని, ఆ తరువాత 2008లో హైకోర్టు ఉత్తర్వులు మేరకు, కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఫేస్‌ టు కింద ఇంటి పట్టా ఇవ్వడం జరిగిందని, అక్కడ ఇల్లు కట్టుకుని ఇతను వీరి కుటుంబీకులు నివాసం ఉంటున్నారని తెలిపారు. అయితే ఇప్పుడు అతను నివాసముంటున్న సమీపంలోని స్థలంనకు పట్టా కావాలని జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీని, లోకాయుక్తలో కేసు వేయడం జరిగిందని, ప్రస్తుతం కోర్టులో కేసు ఉందని, అది అటవీ భూమి అయినందు వల్ల పరిష్కారం చేయలేక పోయామన్నారు. అందుకు ప్రత్యామ్నాయంగా వారి కుటుంబీకులతో సంప్రదించామని భూమిని తీసుకొనేందుకు వారు అంగీక రించారని, ఆ భూమికి సంబంధించి ఎటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. వారికి ఇచ్చిన హామీ మేరకు జిల్లా కలెక్టర్‌ వారిని సోమవారం బాధిత కుటుంబం కలవడం జరుగుతుందని డిఆర్‌ఓ తెలిపారు.