
ప్రజాశక్తి- ఎస్.రాయవరం: నిరంకుశ పాలనతో ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలి ప్రచార్భాటాలకు ప్రాధాన్యతనిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. గురువారం మండలంలోని అడ్డురోడ్డు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, బుధవారం జరిగిన జగనన్నకు చెబుదాం కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిందని, మండలంలోని పలు సమస్యలను తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్న తనను విశాఖలోని తన స్వగృహంలో గృహ నిర్భంధం చేయడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. మండలంలోని పెనుగొల్లు గ్రోయిన్, వరహానది గట్టు, పోలవరం ప్రాధమిక పాఠశాల ఊరికి దూరంగా 3 కిలోమీటర్ల దూరంలో నిర్మించడం వంటి పలు సమస్యలను తెలియపరచాలని అనుకోవడం నేరమా అని ఆమె ప్రశ్నించారు. వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం మండలంలోని సుమారు 12 వేల ఎకరాలకు నీరు లేక బీడు భూములుగా మారే ప్రమాదం నెలకొందన్నారు.గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తనతోనే సాధ్యమని గొప్పలు చెప్పుకుంటున్న ఈ ముఖ్యమంత్రి గ్రామ పంచాయతీ నిధులను మళ్ళించి, పంచాయతీ అధికారాలను రద్దు చేసి, సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన ఘనుడని ఆమె అన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో పలు సమస్యలను తెలియజేస్తే ఇక్కడి అధికారులు, ప్రజాప్రతినిధుల డొల్లతనం బయటపడుతుందనే భయంతో తనను అడ్డుకున్నారన్నారు. తనను గృహ నిర్భంధం చేసిన ఘటనను జిల్లా కలెక్టర్, ఏఎస్పి ల దృష్టికి తీసుకువెళ్తే తమకు తెలియదని చెప్పడం విడ్డూరమని, ఈ ఘటనపై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేపా జిల్లా జనరల్ సెక్రటరీ లాలం కాశీ నాయుడు, మాజీ ఎంపిపి యేజర్ల వినోద్ రాజు, ఎస్.రాయవరం మండల పార్టీ అధ్యక్షుడు అమలకంటి అబద్దం, రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ గుర్రం రామకష్ణ, మాజీ మండల అధ్యక్షులు నల్లపరాజు వెంకట్రాజు, పార్టీ సీనియర్ నాయకులు అల్లు నర్సింహామూర్తి పాల్గొన్నారు.