
ప్రజాశక్తి -అచ్యుతాపురం
సిపిఎం తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రను జయప్రదం చేయాలని ఆ పార్టీ అనకాపల్లి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. అచ్యుతాపురంలో శనివారం జరిగిన పార్టీ సభ్యుల జనరల్ బాడీ సమావేశంలో కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అచ్చుతాపురం ప్రాంతానికి గాలిలో వచ్చి వెళ్లారు తప్ప ఈ ప్రాంత సమస్యలపై పరిష్కారం దిశగా ఏ నిర్ణయం ప్రకటించలేదన్నారు. ఎస్ఇజెడ్ పరిశ్రమలలో స్థానిక నిర్వాసితులకు 75శాతం ఉద్యోగాలు ఇస్తామన్న హామీ నేటి వరకు నెరవేరలేదని తెలిపారు. ఎస్ఇజెడ్, ఫార్మా పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులకు 15 సంవత్సరాలు క్రితం చెల్లించిన వేతనాలే నేటికీ ఇస్తున్నారని, కనీస వేతనాల చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చినపూడి, దుప్పుతురు, చిన్నతార దెబ్బ గ్రామాల ప్రజలు పరిశ్రమల మధ, తీవ్రమైన కాలుష్యం బారినపడి అనారోగ్యాలకు గురవుతున్నారని, వారిని సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేశారు. అచ్యుతాపురం- అనకాపల్లి రహదారి రోడ్డు విస్తరణ చేపట్టకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. పూడిమడక సముద్రతీరంలో జెట్టి నిర్మిస్తామని చెప్పి సంవత్సరాల్లో గడుస్తున్నా నీటికి పనులు మొదలుపెట్టలేదన్నారు. జగనన్న గృహకల్పకు వెదురువాడ, గొర్లి ధర్మవరం గ్రామాల్లో పేదలను నుండి సేకరించిన భూములకు పరిహారం చెల్లించకపోవడం దారుణమన్నారు. కొండకర్ల ఆవ గర్భంలో పూడిక తీయించి ఆయకట్టు భూములకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. అచ్యుతాపురం కేంద్రంగా ఈఎస్ఐ 100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం వెంటనే చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం అచ్యుతాపురం మండల కన్వీనర్ ఆర్.రాము, సీనియర్ నాయకులు కర్రి అప్పారావు, బుద్ధ రంగారావు, తిమ్మరాజుపేట కార్యదర్శి ఎస్.రామునాయుడు, హరిపాలెం కార్యదర్శి బి.రామ్కుమార్, అచ్యుతాపురం కార్యదర్శి కె.సోమునాయుడు, పూడిమడక నాయకులు చేపల తాతయ్య, కృష్ణ, ఆర్.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.