Oct 21,2023 23:33

నీరు లేక ఎదుగుదల లేని వరి పైరును పరిశీలిస్తున్న రైతు నాయకులు

ప్రజాశక్తి-రాంబిల్లి
రాంబిల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం అనకాపల్లి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కర్రి అప్పారావు, ఎం.అప్పలరాజు డిమాండ్‌ చేశారు. మండలంలో వెలుచూరి, పెద్ద కలువులాపల్లి గ్రామాల్లో నీరు లేక ఎండిపోయిన వరి పొలాలను శనివారం రైతు సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు వరి పంట వేయడానికి ఎకరానికి రూ.30వేలు నుంచి రూ.35వేలు వరకు ఖర్చు చేశారని, వర్షాలు లేక పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాంబిల్లి మండలంలో ఖరీఫ్‌ సీజన్లో 6,815 ఎకరాల్లో వరి సాగు చేయాల్సి ఉండగా కేవలం 3,130 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారని, 49 శాతం మాత్రమే వర్షపాతం నమోదైందని తెలిపారు. అయినా ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించకుండా నిర్లక్ష్యం చేస్తూ రైతులకు అన్యాయం చేస్తుందని విమర్శించారు.
అనకాపల్లి జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇందులో ఇద్దరు మంత్రులు ఉన్నా ఒక్కరు కూడా జిల్లాలో కరువు గురించి, రైతుల కష్టాలు గురించి మాట్లాడకపోవడం అన్యాయమన్నారు. జిల్లా కలెక్టర్‌ కరువు, వ్యవసాయ పరిస్థితులపై నిర్వహించిన సమావేశంలో రైతులకు సలహాలు ఇస్తున్నారు తప్ప వారిని ఆదుకోవడానికి ఏవిధమైన చర్యలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వ వెంటనే అనకాపల్లి జిల్లాను, రాంబిల్లి మండలాన్ని కరువు ప్రాంతాలుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కన్వీనర్‌ జి.దేముడునాయుడు, చిన్న కాలువలాపల్లి సర్పంచ్‌ వై.శ్రీనివాసరావు, నాయకులు సిహెచ్‌.శివాజీ, సిహెచ్‌.కృష్ణ, ఎన్‌.నారాయణరావు, వై.రాము, ఎం.శ్రీనివాస్‌, ఎస్‌.రాంబాబు, టి.నూకరాజు తదితరులు పాల్గొన్నారు.