
జీలుగుమిల్లి:మండలంలోని రాచన్నగూడెంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన ఓ మహిళను అతిదారుణంగా కొట్టి ఆపై హత్యచేసి చెరువుగట్టుపై పడేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ వి.చంద్రశేఖర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రాచన్నగూడేనికి చెందిన కన్నోజు అనసూయ(70)కు భర్త, ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలున్నారు. ఇటీవల కుటుంబంలో ఆర్థిక కలహాలు తలెత్తడంతో గత కొంతకాలంగా అనసూయ చిన్న కుమారుడు శ్రీను వద్దే ఉంటుంది. ఈ తరుణంలో చెరువు గట్టు వద్ద అనుమానాస్పద స్థితిలో ఆమె మృతిచెందింది. మంగళవారం తెల్లవారుజామున అటువైపు వెళ్లిన స్థానికులు గుర్తించి పోలీసులకు, బంధువులకు సమాచారం అందించారు. వెంటనే సిఐ వెంకటేశ్వరావు, ఎస్ఐ చంద్రశేఖర్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్ట్మార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాల కోసం వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను అతిత్వరలో పట్టుకుంటామని సిఐ వెంకటేశ్వరావు తెలిపారు.