Jul 14,2023 22:11

మహిళకు కరపత్రం అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి

        ప్రజాశక్తి-ఉరవకొండ  జనసేన అధ్యక్షులు పవన్‌కళ్యాణ్‌ ఓ రాజకీయ అజ్ఞాని అని రాజకీయాలపై అవగాహన లేకుండా, సమాజంపై బాధ్యత లేని వ్యక్తిగా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. శుక్రవారం మండలంలోని నింబగల్లు గ్రామంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికీ సమస్యలను అడిగి తెలుసుకోవడంతోపాటు సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటున్న వలంటీర్‌ వ్యవస్థను దెబ్బతీసేందకే టీడీపితో కుట్ర పన్ని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలోని ప్రముఖ సర్వేలన్నీ మరోసారి జగన్‌ సీఎం కావడం ఖాయమని చెబుతుండడంతో పవన్‌కళ్యాణ్‌ తీవ్ర నిరాశ, నిస్పృహల్లో ఉన్నాడన్నారు. అందుకే ఏం మాట్లాడుతున్నాడో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా మెచ్చుకుని ఆదర్శంగా తీసుకుంటున్న వాలంటీర్‌ వ్యవస్థ గురించి చులకనగా మాట్లాడడం దారుణమన్నారు. ఈ సమావేశంలో వైసిపి బిసి విభాగం జిల్లా అధ్యక్షుడు వీరన్న, ఎంపిపి చందా చంద్రమ్మ, జెడ్పిటిసి పార్వతమ్మ, వైస్‌ ఎంపిపి నరసింహులు, కమ్మ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ తేజోనాథ్‌, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ సుశీలమ్మ, పెన్నఅహోబిలం ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్‌ అశోక్‌కుమార్‌, సర్పంచి సునీత, ఎంపిటిసి ఈశ్వర్‌, పిఎసిఎస్‌ డైరెక్టర్‌ చిదంబరం నాయుడు, నాయకులు జెట్టి.రమేష్‌, ఓబులేసు, శివరాజు, హనుమప్ప, తదితరులు పాల్గొన్నారు.