Oct 19,2023 00:25

పట్టాలు చూపుతున్న రైతులు

ప్రజాశక్తి -రావికమతం:ప్రభుత్వం గతంలో ఇచ్చిన పట్టాలను రద్దు పరిచిన మండల స్థాయి రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కవగుంట గ్రామానికి చెందిన పలువురు రైతులు పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం 2013, అంతకుముందు పేద రైతులందరికీ పట్టాలు పంపిణీ చేసిందన్నారు. ఇటీవల జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం జగనన్న భుహక్కు భూ రక్ష సమగ్ర భూ సర్వేలో భాగంగా కవగుంట, బుడ్డిబంద గ్రామాలలో సర్వే నిర్వహించారని రైతులు తెలిపారు. ఈ సర్వేలో కొద్దిమంది మండల స్థాయి అధికారులు పైసలకు కక్కుర్తి పడి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు పాస్‌ పుస్తకాలు మంజూరు చేశారన్నారు. సర్వే నెంబరు పక్కన ఉన్న సుమారు 25 మంది రైతులకు గతంలో ప్రభుత్వం పట్టా పాస్‌ పుస్తకాలు మంజూరు చేసిందని, ఆన్లైన్‌ ఉన్నప్పటికీ వారందరి తాలూకా పట్టాలను రద్దు పరచడం పట్ల గ్రామానికి చెందిన రైతులు రొబ్బ వరహాలు దొర, సమాల కళ్యాణం, నమ్మి రామనాయుడు, ఉరికిటి బంగారమ్మ, నమ్మి రాము, దాసరి అచ్చియమ్మ, బీరా పరిసరాము, దేవర మారమ్మ ,తురాయి రాజు, సిద్ధ లక్ష్మి, రోబ్బ నాగరాజు, తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తప్పు చేసిన వ్యక్తులపై రైతాంగానికి త్వరితగతిన న్యాయం చేయాలని ఆయన తెలిపారు.