బుక్కరాయసముద్రం : సిఎం జగన్ పశుపోషణకు చేయూతను అందిస్తున్నారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తెలిపారు. శనివారం మండలంలోని సిద్ధరాంపురం గ్రామంలో ఉన్న శ్రీవెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, అనుసంధానమైన పశుపరిశోధన కేంద్రంలో (టి.ఎస్.పి) ట్రైబల్ సబ్ప్లాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిశోధనా కేంద్రం శింగనమల మండలం నాగులగుడ్డం తండాను దత్తకు తీసుకుని 28 మంది రైతులు, బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం గ్రామానికి చెందిన మరో ఇద్దరు రైతులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. అంతేగాకుండా ట్రైబల్ సబ్ ప్లాన్, ఐసిఎఆర్, పశు పరిశోధనా కేంద్రం, పలమనేరు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి.వేణు ఆర్థిక సహకారంతో ఒక్కొకరికి రెండు నెల్లూరు బ్రౌన్ పొట్టేళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పశు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హెచ్.శ్రీనివాస నాయక్, పలమనేరు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి.వేణు, డాక్టర్ రత్నకుమార్, ఎంపీపీ సునీత, జడ్పిటిసి భాస్కర్, సిద్ధరాంపురం సర్పంచి కొండన్న, నాయకులు చెన్నంపల్లి రాజశేఖర్రెడ్డి, రేకులకుంట సాకే రామకృష్ణ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పొట్టేళ్లు పొందిన రైతులతో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి










