Oct 08,2023 00:56

గోతులుగా ఉన్న బిఎన్‌ రహదారి

ప్రజాశక్తి -కొత్తకోట:ఆర్‌ అండ్‌ బి అధికారులు, రహదారి నిర్మాణ కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం కారణంగా నర్సీపట్నం- చోడవరం (బిఎన్‌) రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. రహదారి ఎక్కడ చూసినా గోతులు మయంగా మారి వాహన దారుల పాలిట శాపంగా మారింది గత ఏడాది కిందట బుచ్చెయ్యపేట మండలం బంగారుమెట్ట నుంచి రావికమతం మండలం మీదుగా రోలు గుంట మండలం యలంకాయలపాలెం వరకూ సుమారు రూ కోటి 10 లక్షల నిధులతో రహదారి నిర్మాణ పనులు చేపట్టారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ బడా కాంట్రాక్టర్‌కు టెండర్‌ ద్వారా పనులు అప్పగించారు.గతేడాదిగా ఈ రహదారి పనులు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా అడపా అడపాదడపా కురుస్తున్న వర్షాలకు రహదారి మొత్తం గోతులు మయంగా మారింది. దీంతో ఇటు నర్సీపట్నం వెళ్లాలన్న అటు చోడవరం వెళ్లాలన్నా వాహనదారులు నరకయాతన పడుతున్నారు. అంతేకాకుండా రోజు ఏదో చోట రోడ్డు ప్రమాదాలు గురవుతున్నారు. ఆర్‌అండ్‌బి అధికారుల పర్యవేక్షణ లేక పోవడంతో కాంట్రాక్టర్‌ నిర్లక్ష్య ధోరణితో వ్యవరిస్తున్నారన్నా ఆరోపణలు వినిపిస్త్తున్నాయి. .ఎక్కడికక్కడ రహదారి గోతులుగా మారడంతో పాటు కాంట్రాక్టర్‌ చేపట్టిన కల్వర్టుల నిర్మాణం కూడా జాప్యం చేయడంతో రహదారి మరింత ప్రమాదంగా మారింది.
మాడుగుల నియోజకవర్గంలో ఉపముఖ్యమంత్రి ఇలాకాలో దేవరపల్లి, కోటపాడు మండలాల్లో ఆరు నెలల్లో రోడ్లు నిర్మాణ పనులు పూర్తి కాగా, అనకాపల్లి నుంచి బుచ్చయ్యపేట మండలం రాజాం వరకు చేపట్టిన రహదారి నిర్మాణ పనులు శరవేగంగా ఆరు నెలలు పూర్తికావొచ్చాయి. చోడవరం నియోజకవర్గంలో మాత్రం ఏడాదిన్నరగా రహదారి మరమత్తు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడ గానే ఉన్నాయి. రహదారి నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ తెలుగుదేశం పార్టీ చెందిన సానుభూతి పరుడు కావడంతో ప్రభుత్వా నికి చెడ్డ పేరు తేవడం కోసం నిర్మాణ పనులలో జాప్యం చేస్తున్నాడని ప్రభుత్వ విప్‌, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్‌ టెండర్‌ విధానంలో నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కాంట్రాక్టర్‌, ఆర్‌ ఎం బి అధికారులు నిర్మాణ పనులను వేగవంతం చేసి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.