
ప్రజాశక్తి- చీడికాడ: గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికే జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రవి పట్టన్శెట్టి తెలిపారు. మండల కేంద్రమైన చీడికాడ తులసి కళ్యాణ మండపంలో బుధవారం జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ జాహ్నవి మాట్లాడుతూ, రెవిన్యూ శాఖ, హౌసింగ్ పేమెంట్ల సమస్యలపై వినతలు అధిక సంఖ్యలో వచ్చినట్లు తెలిపారు. సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా చూస్తామని తెలిపారు. నియోజకవర్గ టిడిపి నాయకులు పైలా ప్రసాదరావు టిడిపి నాయకులతో కలిసి వచ్చి నియోజవర్గంలో పలు సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ, దేవరపల్లి మండలంలో కలిగొట్ల బ్రిడ్జి వద్ద ఏటిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, దీంతో బ్రిడ్జి కోతకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఇసుక తవ్వకాలను ఆపాలని పలుమార్లు డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడుకి విన్నవించినా చర్యలు తీసుకోలేదని ప్రసాద్ రావు వాపోయారు. నిలిచిపోయిన కలిగొట్ల వంతెన అప్రోచ్ పూర్తి చేయాలని, శిథిలావస్థలో ఉన్న మాడుగుల నుండి కింతలి రోడ్డు మెరుగు పరచాలని, ఘాటి రోడ్డు నుండి తాటిపర్తి వరకు తారు రోడ్డు వేయాలని కలెక్టర్ కు వినతిపత్రం అందజేసినట్టు ప్రసాద్రావు తెలిపారు. గిరిజన గ్రామాల్లో గిరిజన సమస్యలను పరిష్కరించాలని గిరిజన సంఘ నాయకులు అజరు కుమార్ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ శర్మ, డిఆర్ డిఎ పిడి లక్ష్మీపతి, ఎఎస్పి ప్రభాకర్రావు, తహసిల్దార్ బీవీ రాణి, ఎంపీడీవో జయ ప్రకాష్ పాల్గొన్నారు.