ఆసుపత్రిలో చిన్నారుల వార్డును పరిశీలిస్తున్న మంత్రి ఉషశ్రీ చరణ్
కళ్యాణదుర్గం : ప్రభుత్వ వైద్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్ తెలిపారు. బుధవారం ఆమె కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన ఆపరేషన్ ధియేటర్, మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. బాల్యవివాహాల నిర్మూలనపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ఆసుపత్రిలో పిల్లల వార్డును పరిశీలించి అక్కడ అందుతున్న వైద్యసేవలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదలందరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పని చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.










