పోలీస్ ఆయుధాల ప్రదర్శన
రెండు రోజుల పాటు విద్యార్థులకు అవగాహన
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని స్థానిక పాత ఎస్పీ కార్యాలయంలో పోలీస్ ఆయుధాల ప్రదర్శనను అడిషనల్ ఎస్పీ జగదీష్ ప్రారంభించారు. ఈసందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ ఎఆర్ పోలీసులు ఉపయోగించే ఆయుధాలను పోలీసులు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని రెండు రోజుల పాటు ప్రదర్శనలో ఉంచుతున్నట్ల చెప్పారు. పోలీసు వ్యవస్ధ పనితీరు గురించి, పోలీసులు తమ దైనందిన విధుల్లో వినియోగించే వివిధ రకాల ఆయుధాలు, పరికరాలు, సాధనాల గురించి కళాశాల, పాఠశాల విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. విద్యార్థులకు ఆయుధాల గురించి ఎఆర్ సిబ్బంది అవగాహన కల్పించారు. ఎలాంటి సందర్భంలో ఎలాంటి ఆయుధాన్ని వినియోగిస్తారు, వాటి పనితీరు గురించి వివరించారు. ఆయుధాల ప్రదర్శనలో బాంబు డిటెక్షన్ స్క్వాడ్ విభాగం, కమ్యూనికేషన్ విభాగం, ఫింగర్ ప్రింట్స్ మరియు క్లూస్ టీం, ట్రాఫిక్ విభాగం, దిశా యాప్ పై అవగాహన, పోలీస్ ఆఫీసర్స్కేడర్స్, ఎర్రచందనం, ఎస్ఈబి, ఎల్హెచ్ఎంఎస్ పనితీరు, సైబర్ క్రైమ్ ప్రత్యేక స్టాల్ను ప్రదర్శన, సైబర్ నేరాల పట్ల యువతలో అవగాహన కల్పించారు. పోలీస్ వాహనాల ప్రదర్శన, ఫ్రీ గో వెహికల్స్, దిశా మొబైల్ రెస్ట్ రూమ్స్ వాహనం తదితర వాహనాలను ప్రదర్శనలో ఉంచారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ డాక్టర్ కెవి.శ్రీనివాస రావు, సిసిఎస్ డిఎస్పి శ్రీనివాస మూర్తి, చిత్తూరు టౌన్ డిఎస్పి ఎన్.సుధాకర్ రెడ్డి, సిసిఎస్ డిఎస్పి శ్రీనివాసులురెడ్డి, దిశా డిఎస్పీ బాబుప్రసాద్, ట్రాఫిక్ డిఎస్పీ తిప్పేస్వామి, ఏఆర్ డిఎస్పి లక్ష్మి నారాయణరెడ్డి, ఆర్ఐలు నీలకంటేశ్వర రెడ్డి, శ్రీమధు, ఇన్స్పెక్టర్లు భాస్కర్, శ్రీనివాసరెడ్డి, బాలయ్య, మద్దయ్యచారి, ఆర్ఎస్సైలు, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉదరు, ఎఆర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.










