
ప్రజాశక్తి-అనకాపల్లి
విధి నిర్వహణలో అమరులైన పోలీసుల సేవలు మరువలేనివని కలెక్టర్ రవి పటాన్ శెట్టి, ఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం శనివారం జిల్లా ఎస్పీ కెవి.మురళీకృష్ణ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో ఘనంగా నిర్వహించారు. పోలీసు అమరవీరుల స్మృతి స్థూపం వద్ద పరేడ్ నిర్వహించి, గౌరవ వందనం చేసి, పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీసు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తపరుస్తూ, పోలీసు కుటుంబాలకు ఎటువంటి సమస్యలు ఉన్నా తక్షణమే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ ఈ ఏడాది దేశ వ్యాప్తంగా 188 మంది, మన రాష్ట్రంలో ఒకరు పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించారని తెలిపారు. అనంతరం కలెక్టర్ చేతుల మీదుగా 13 మంది అమరవీరుల ఒక్కొక్క కుటుంబానికి రూ.10వేలు చొప్పున చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి, అసిస్టెంట్ కలెక్టర్ బి.స్మరణ్ రాజ్, న్యాయమూర్తులు జి.గంగరాజు, పి.ప్రదీప, బివి.విజయలక్ష్మి, ఎం.శివ కిరణ్, నర్సీపట్నం అదనపు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
సబ్బవరం : స్థానిక పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎస్సై ఎల్.సురేష్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. వారం రోజులపాటు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని ఎస్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్సి కెటిఎన్ శ్రీనివాసరావు, సత్యనారాయణ, తాతారావు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
కొత్తకోట : పోలీస్ అమరవీరుల దినోత్సవ వేడుకలు సందర్భంగా కొత్తకోట సీఐ సయ్యద్ ఇలియాస్ మహమ్మద్ ఆధ్వర్యాన గ్రామంలో భారీ ర్యాలీ, మానవహారంగా చేపట్టి పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళుల ర్పించారు. ఈ కార్యక్రమంలో కొత్తకోట ఉప సర్పంచ్ పందల దేవ, సీపీఐ మండల కార్యదర్శి జోగిరాజు, కొత్తకోట,రావికమతం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
రోలుగుంట : రోలుగుంటలో శనివారం ఎస్సై నాగకార్తీక్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ నుండి స్థానిక మెయిన్ రోడ్డు కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, శాంతియుత భారతం కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలు మరవలేనివన్నారు.
పోలీసు అమరవీరులకు నివాళి
ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ : నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవి శంకర్ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని శనివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. బీచ్ రోడ్డులోని పోలీసు అమర వీరుల స్మతి స్తూపం వద్ద జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని హాజరయ్యారు. పోలీస్ అమరవీరులకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసుల సేవలను కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ రవి శంకర్ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల దినం నేపథ్యాన్ని వివరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జునరావు, జివిఎంసి కమిషనర్ సాయికాంత్ వర్మ, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.